మానవతా దృక్పథంతో ఆదుకుందాం : సీఎం జగన్

by  |
CM Jagan
X

దిశ, ఏపీ బ్యూరో: ‘వరద బాధితులను పెద్దమనసుతో ఆదుకోండి. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ప్రతీ గడపకు తీసుకెళ్లండి. ప్రభుత్వ సాయం అందనివారు ఎవరూ ఉండకూడదు. ఇలాంటి కష్టసమయంలోనే ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవాలి. వరద ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5లక్షలు సాయం అందించాలి. పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బాధితులకు రూ.2వేలు ఇవ్వాలి’ అని సీఎం జగన్ తెలిపారు. సచివాలయంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రైతులను ఆదుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి అని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతీ ఇంటికీ పరిహారం అందాలి

‘వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండండి. మానవతా దృక్పథంతో ఆదుకోండి. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ వంటనూనె, కేజీ ఉల్లి, కేజీ పొటాటో, రూ.2వేలు తక్షణమే అందించండి. గ్రామాన్ని, వార్డును యూనిట్‌గా తీసుకుని వలంటీర్లు ప్రతీ ఇంటికి సాయం అందించండి. ముంపునకు గురైన ప్రతి ఇంటికీ ఈ పరిహారం అందాలి. సహాయక శిబిరాల్లో ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించండి. సహాయక శిబిరం నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు కుటుంబానికి రూ.2వేలు ఇవ్వాలి. విద్యుత్‌పునరుద్ధరణ, రక్షిత తాగునీటిని అందించడం యుద్ధ ప్రాతిపదికన చేయాలి. దీనిమీద ప్రత్యేక దృష్టి పెట్టాలి’అని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

104కు ప్రత్యేక అధికారిని నియమించండి

‘వరదలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా 104 కాల్‌ సెంటర్‌‌కు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలి. ఈ నంబర్‌కు విస్తృత ప్రచారం కల్పించండి. 104కు ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే అధికారులు స్పందించి… బాధితులకు తోడుగా నిలవాలి. జిల్లాల్లో 104కు ప్రత్యేక అధికారిని నియమించండి. పారిశుద్ధ్యం, వైద్య శిబిరాల నిర్వహణపై దృష్టిపెట్టండి. ఎక్కడ అవసరమవుతుందో.. అక్కడ పెట్టండి, ఒక డ్రైవ్‌లా చేయండి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

రోడ్ల పునరుద్ధరణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

వరదల ప్రభావంతో పాడైన రోడ్లను పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టిపెట్టండి. రవాణా సాగేలా ముందు తాత్కాలిక పనులు వెంటనే చేయాలి. శాశ్వతంగా చేయాల్సిన పనులపై కార్యాచరణ రూపొందించాలి. వరదను దృష్టిలో ఉంచుకుని ఆమేరకు డిజైన్లు రూపొందించి శాశ్వత పనులు చేపట్టాలి. వచ్చే నాలుగు వారాల్లో టెండర్లను ఖరారుచేసి… పనులు మొదలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. పంచాయతీరాజ్, మున్సిపల్‌విభాగాలు దీనిపై చర్యలు తీసుకోవాలి అని సీఎం సూచించారు.

ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ.95,100

‘ఇళ్లు కూలిపోయినా, పాక్షికంగా దెబ్బతిన్నా.. వారికి వెంటనే నగదు ఇవ్వండి. పూర్తిగా ఇళ్లు ధ్వంసం అయిన వారికి రూ. 95,100 ఇవ్వడంతోపాటు కొత్త ఇల్లు వెంటనే మంజూరు చేయండి. దీనివల్ల వెంటనే పనులు మొదలు పెట్టగలుగుతారు. పాక్షికంగా నష్టం వాటిల్లిన ఇంటికి రూ. 5,200 నగదు వెంటనే అందించేలా చూడాలి. ప్రాణాలు కోల్పోయిన వారికి ఇప్పటికే 90శాతం మేర నష్టపరిహారం అందించారు. మిగిలిన వారికి వెంటనే అందించేలా అన్నిరకాల చర్యలు తీసుకోవాలి. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు తోడుగా నిలవండి.

నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి, గ్రామ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి, ఆర్టీసీ కండక్టర్‌ కుటుంబానికి తోడుగా ఉండండి. వారికి వెంటనే సహాయం అందేలా చర్యలు తీసుకోండి. ఆ కుటుంబాల పట్ల ఉదారంగా ఉండండి, రూ.25 లక్షల పరిహారం వారి కుటుంబాలకు అందించండి. విపత్తులో సహాయం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు కాబట్టి… మిగిలిన వారిలో ధైర్యం నింపడానికే ఈ చర్యలు. వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వండి’ అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

పంటల నష్టం ఎన్యుమరేషన్‌ చేపట్టండి

పంటల నష్టం ఎన్యుమరేషన్‌ మొదలు పెట్టండి. విత్తనాలు 80శాతం సబ్సిడీపై సరఫరా చేయండి. అలాగే మరణించిన పశువుల కళేబరాల వల్ల వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోండి. పశువుల ఆరోగ్యంపైనా దృష్టిపెట్టండి. వాక్సిన్లు సహా ఇతర చర్యలు తీసుకోండి. చెరువులు, ఇతర జలాశయాలు, కట్టల మీద దృష్టిపెట్టండి. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు నివేదికలను అందించాలి. బంగాళాఖాతంలో మళ్లీ వస్తున్న అల్పపీడనం తమిళనాడు దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నట్టు చెప్తున్నారు. అయినా సరే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండండి.

కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.10 కోట్లు చొప్పున, మొత్తంగా రూ.40 కోట్లను వెంటనే ఇస్తున్నాం. అధికారులు అంతా డైనమిక్‌గా పని చేయాలి. ఎలాంటి సమస్య ఉన్నా.. నా దృష్టికి తీసుకు రండి అని సీఎం సూచించారు.

విద్యుత్‌ పునరుద్ధరణలో ఆలస్యం వద్దు

విద్యుత్ పునరుద్ధరణలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదు. సరిపడా సిబ్బందిని తరలించి అన్నిరకాల చర్యలు తీసుకోండి. వరద ముంపును పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా సంబంధించి సబ్‌స్టేషన్లను, కరెంటు సరఫరా వ్యవస్థను ముంపు లేని ప్రాంతాలకు తరలించాలి. అలాగే పశువులకు దాణా కూడా అందించమని ఆదేశాలు జారీచేశాం. పశువులు మరణిసే… నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోండి.

గండ్లు పడ్డ చెరువుల్లో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. పింఛ, అన్నమయ్య ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించాలి అని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, జలవనరులశాఖ స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.



Next Story

Most Viewed