త్రిపురలో టీచర్లపై లాఠీచార్జ్

by  |
త్రిపురలో టీచర్లపై లాఠీచార్జ్
X

అగర్తలా: త్రిపురలో ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన ఉపాధ్యాయుల ఆందోళన బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టడం కోసం పోలీసులు లాఠీచార్జ్ చేయడంతోపాటు వాటర్ కెనన్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగించడంతో 40 మందికి గాయాలయ్యాయి. ఆందోళనకారుల ఘర్షణకు దిగడంతో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. 2010లో జరిగిన 10,323 మంది టీచర్ల నియామకాల్లో అక్రమలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ హైకోర్టు 2014లో నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

తమను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని డిమాండు చేస్తూ గత 52 రోజులుగా తొలగింపునకు గురైన ఉపాధ్యాయులు అగర్తలలో ఆందోళన చేస్తున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా నగరంలో 144 సెక్షన్ విధిస్తూ అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకున్నది. ఈ ఆదేశాల మేరకు ధర్నా స్థలాన్ని ఖాళీ చేయాలని ఆందోళనకారులకు పోలీసులు సూచించారు. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువును ప్రయోగించడంతోపాటు వాటర్ కెన్లను ప్రయోగించారు. దాదాపు 300 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story