ప్రభుత్వమే మద్య దళారీలా మారిపోయింది : ప్రొఫెసర్ కోదండరాం

by  |
ప్రభుత్వమే మద్య దళారీలా మారిపోయింది  : ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ, సంగారెడ్డి: ప్రభుత్వం దళారీలాగా మారి పేదల భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. జహీరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న నిమ్జ్ లో భూములు కోల్పోయిన రైతులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత రైతులకు ప్రొఫెసర్ కోదండరామ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమ్జ్ లో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. నిమ్జ్ ఏర్పాటులో చిన్న, సన్నకారు రైతుల భూములు తప్ప, ఏ ఒక్క టీఆర్ఎస్ నాయకుడి భూమి పోలేదన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా, పరిశ్రమలు ఏర్పాటు చేసినా పేదల భూములే లాకుంటున్నారన్నారు. భూములు కోల్పోతున్నామనే మనోవేదనతో ఇటీవల మోహన్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదన్నారు. పేదల భూములు లాక్కుంటే వారు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేని నిమ్జ్ కు భూములు ఎలా లాక్కుంటారని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఢిల్లీ దాకా వెళ్లి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. ధర్నా అనంతరం రైతులతో కలిసి వారు తెచ్చుకున్న రొట్టెలను కోదండరామ్ తిన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed