కనిపిస్తే కబ్జాయే..రోడ్డునూ వదలని వైనం

by  |
కనిపిస్తే కబ్జాయే..రోడ్డునూ వదలని వైనం
X

దిశ, న్యూస్ బ్యూరో: అక్కడ గజం ధర రూ.లక్షకు తగ్గదు. ప్రతి అంగుళం విలువైనదే. హైటెక్ సిటీకి కూతవేటు దూరమే. అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఎవరైనా అక్కడ నివాసముండేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎవరైనా అపార్టుమెంటు కట్టడం మొదలు పెట్టారంటే చాలు.. ఫ్లాట్లు బుక్ చేసుకుంటారు. అలాంటి ప్రాంతాల్లోనూ కొందరు సేల్ డీడ్‌లోని మ్యాపులకు నిర్మాణాలను మార్చేస్తున్నారు. డాక్యుమెంట్‌లోని విస్తీర్ణానికి వారు నిర్మిస్తోన్న స్థలానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. వారికి అనుకూలంగా ప్లాట్లను తీర్చిదిద్దుకుంటున్నారు. ప్లాట్లను వారికి అనుకూలంగా మూలలను తీర్చిదిద్ది దీర్ఘచతురస్రాకారంగా ఉండేటట్లు చేస్తున్నారు. రోడ్లనూ ఆక్రమించుకొని బహుళ అంతస్థుల భవనాలను నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. వారికి సెట్ బ్యాక్స్ నిబంధన కూడా అసలే వర్తించదు. ఎందుకంటే వారందరికీ ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు బాగా పరిచయం.

వారి ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు ఎలాంటి ఢోకా లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు కడుతున్నారన్న సమాచారం వస్తే చాలు.. వెంటనే బల్దియాలోని విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూల్చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చాలా సార్లు ప్రకటించారు. కానీ హైదరాబాద్ మాదాపూర్ సైబర్ హిల్స్‌లో ఏ ఒక్కసారి కూల్చివేతకు నోచుకోలేదు. అనేక భవనాలు నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినవే. కాలనీలో బహుళ అంతస్థుల భవనాన్ని ఎలాంటి సెట్‌బ్యాక్ లేకుండానే నిర్మించారు. కానీ ఎలాంటి చర్యలూ లేవు. ఒక్కసారి టేప్ పెట్టి కొలిస్తే చాలు.. పెద్దల ఇండ్లల్లో ఎన్ని అక్రమాలు ఉన్నాయో, ఆక్రమణలు ఉన్నాయో తెలుస్తుందని కాలనీవాసులు అంటున్నారు. పైగా వీరంతా బడాబాబులు కావడంతో అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయడం కూడా కష్టమే. ఈ కాలనీపై డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దృష్టి పెట్టి ప్రతి ఇంటి డాక్యుమెంటులోని హద్దులు, కొలతలను పరిశీలిస్తే అక్రమాల పుట్టలు బయటపడుతాయని స్థానికులు కోరుతున్నారు.

దొంగ డాక్యుమెంట్లతో అక్రమాలు..

దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం, రోడ్లను ఆక్రమించి నిర్మాణాలకు అనుమతుల కోసం దరఖాస్తు చేయడం, జీహెచ్ఎంసీ అధికారులు యథేచ్ఛగా అనుమతులివ్వడం సాఫీగా జరిగిపోతున్నది. మాదాపూర్‌లోని కాకతీయ హిల్స్ రోడ్డు నంబరు 11 నుంచి సైబర్ హిల్స్ మీదుగా హైటెన్షను లైను కింద కొత్తగా వేసిన 100 అడుగుల రోడ్డును కలిపేందుకు 40 అడుగుల లింకు రోడ్డు లేఅవుట్లో ఉంది. కొత్త 100 అడుగుల రోడ్డు వచ్చిన తర్వాత భూమి విలువ పెరిగిపోవడంతో అక్రమార్కులు రెచ్చిపోయి నిర్మాణాలు ప్రారంభించారు. సైబర్ హిల్స్ 32వ సర్వేనంబరు మొదటి రోడ్డులో 68, 69 ప్లాట్ల యజమాని పెద్ద అపార్టుమెంటు నిర్మాణం ప్రారంభించారు. ఈ ప్లాటు దక్షిణపు కొలత ఉత్తరపు కొలతకు పది అడుగుల తేడా ఉంటుంది. యజమాని రోడ్డులో ఆ పది అడుగులను కలుపుకుని చతురస్రం చేసుకుని నిర్మాణం జరుపుతున్నారు. తనకు జీహెచ్ఎంసీ అనుమతిచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు.

రేపోమాపో మొదటి స్లాబు కూడా వేయనున్నారు. ఇక 86, 87 ప్లాట్ల యజమానిది అదే తీరు. ఆయనకు 86, 87 రెండు ప్లాట్లలో కలిపి ఉన్నది 440 గజాలు. ఆయన ఆ ప్లాట్లకు యూఎల్సీ కూడా రాలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. కొత్తగా 86ఎ, 87ఎ పేరుతో ఒక డాక్యుమెంటు సృష్టించి తనకు 603 గజాల స్థలం ఉన్నట్టు అందులో అపార్టుమెంటు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీకి అనుమతికోసం దరఖాస్తు పెట్టారు. ఈ స్థలాల యజమాని ముందుగానే ఎటువంటి డాక్యుమెంటు లేకుండానే ఈ లింకు రోడ్డును ఆక్రమించి అడ్డంగా ఒక షెడ్డును నిర్మించాడు. ఇప్పుడు ఈ ప్లాట్ల విస్తీర్ణాన్ని పెంచి చూపడంకోసం నడి రోడ్డు నుంచి కొలతలు వేసి 603 గజాలు చేసి చూపించాడు. సైబర్ హిల్స్ కాలనీ వాసులు చాలా రోజులుగా ఈ లింకు రోడ్డు కోసం అడుగుతున్నారు. రోడ్డు గురించి ఏమాత్రం ఆసక్తి చూపించని అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించకుండా, అసలు యూఎల్సీ వచ్చిందీ లేనిదీ తెలుసుకోకుండా భవన నిర్మాణ అనుమతి ఇచ్చారని తెలిసింది. ఆ మేరకు మార్ట్ గేజ్ ఒప్పందం కూడా పూర్తయిందని సమాచారం. ఇకనైనా లే అవుట్, వారి సేల్ డీడ్స్, అనుమతులను పరిశీలించిన రోడ్లు కబ్జాకు గురి కాకుండా రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed