కృష్ణాజలాల్లో 50శాతం వాటా రావల్సిందే : రజత్‌కుమార్

by  |
కృష్ణాజలాల్లో 50శాతం వాటా రావల్సిందే : రజత్‌కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణాజలాల్లో 50శాతం తెలంగాణకు వాటా కోరుతున్నామని తెలంగాణ సాగునీటిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం సోమాజిగూడలోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. వాటా ప్రకారం తెలంగాణ‌కు 570 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్వహ‌ణ ఎలా చేస్తార‌ని అడగడంతో‌పాటు బోర్డు ప‌రిధిలోకి ఏ ప్రాజెక్టులు ఇవ్వాల‌నే అంశంపై చ‌ర్చిస్తామ‌న్నారు.

కృష్ణా జ‌లాల విష‌యంలో తెలంగాణ‌కు వాటా పెర‌గాలని, న‌దీ ప‌రివాహ‌క ప్రాంతం తెలంగాణ‌లో అధికంగా ఉందన్నారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగ‌ర్, క‌ల్వకుర్తి ప్రాజెక్టుకు నిక‌ర జ‌లాలు కేటాయించాలని, కొత్త ట్రిబ్యున‌ల్ వ‌చ్చే వ‌ర‌కు మ‌రో 105 టీఎంసీలు ఇవ్వాల‌న్నారు. బోర్డు ప‌రిధిలో విద్యుత్ ప్రాజెక్టులూ ఉండాల‌ని కోరనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ‌లో అనేక ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు ఉన్నాయని, నీటి వాటాతో పాటు విద్యుత్ ఉత్పత్తి కూడా త‌మ‌కు ముఖ్యమని స్పష్టం చేశారు. ఎత్తిపోత‌ల ప‌థ‌కాలు, బోరుబావుల‌కు విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. స‌మావేశం అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు వెల్లడించారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షత‌న జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీటిపారుద‌ల శాఖ అధికారులు హాజ‌ర‌య్యారు.

Next Story