KIA కార్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా 3 లక్షల వరకు ఆదా..!

by  |
kia-carnival
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా దేశీయ మార్కెట్లో పుంజుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం తన ఎంట్రీ లెవెల్ ప్రీమియం వేరియంట్ మోడల్ కియా కార్నివాల్ ఎంపీవీ కారుపై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. వినియోగదారులకు ఏకంగా రూ. 3.75 లక్షల వరకు భారీ తగ్గింపు ఆఫర్‌ను కియా అందించనుంది. కియా కార్నివాల్ ధర రూ. 24.95 లక్షలు కాగా, షోరూమ్ ధరపై రూ. 2.50 లక్షల నగదు తగ్గింపు సహా వార్షిక నిర్వహణ ఖర్చులు, వారెంటి పొడిగింపు ప్యాకేజీ లాంటి పలు ప్రయోజనాల ద్వారా అదనంగా మరో రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు లభిస్తుందని, తద్వారా ఈ కారును రూ. 21.20 లక్షలకే వినియోగదారులు సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

గతేడాది కియా కార్నివాల్ ఎంపీవీ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టగా, ఇది ప్రెసిటీజ్, ప్రీమియ, లిమోసిన్ వంటి మూడు ట్రిమ్‌లలో లభిస్తోంది. ఈ కారు 9 సీట్లతో నాలుగు వరుసలను కలిగి ఉంటుంది. 200 హెచ్‌పీ ఇంజన్ పవర్‌తో 8-స్పీడ్ ఆటోమెటిక్ గేర్ బాక్స్, ఇంకా అనేక అత్యాధునిక ఫీచర్లను ఈ మోడల్‌లో అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఇటీవల కియా ప్రత్యేక హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌కు ఆ పథకం వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ పథకం ప్రకారం.. కొత్త కస్టమర్లు కియా కార్నివాల్ పట్ల సంతృప్తి చెందని పక్షంలో మొత్తం ఖర్చులో 95 శాతం రీఫండ్ కోసం కార్నివాల్ ఎంపీవీ కారును కొన్న 30 రోజుల్లోగా తిరిగిచ్చేందుకు ఈ పథకం అవకాశం ఇస్తుంది. దీనికోసం అర్హత ఉన్న వినియోగదారులు తమ కొత్త కార్నివాల్ ఎంపీవీ మోడల్‌ను కొన్న తేదీ నుంచి 1,500 కి.మీ.లోపు ప్రయాణించి ఉండాలి. డ్యామేజీ, ఫెయిల్యూర్ లాంటివి లేకుండా ఉండే ఈ పథకం అమలవుతుంది.

Next Story