సాగర్​ గెలుపు కోసం… కేసీఆర్ 'సాత్' వ్యూహం

by  |
సాగర్​ గెలుపు కోసం… కేసీఆర్ సాత్ వ్యూహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : అధికార పార్టీలో సాగర్​ ఎన్నికపై దూకుడు మొదలైంది. మండలి ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న గులాబీ… సాగర్​లో ఎలాగైనా గెలువాలనే లక్ష్యంతో ప్లాన్​ వేస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్​ ఇవ్వాళ లేదా రేపు మరోసారి సమావేశం కానున్నారు. ఈ ఉపఎన్నికలో ఎవరిని పోటీకి దింపాలనే అంశంపై అభిప్రాయం తీసుకోనున్నారు. మరోవైపు సాగర్​ టికెట్​ కోసం సీనియర్లు ఫైట్​ చేస్తున్నారు.

ఏడుగురు మంత్రులు అక్కడే

ఉప ఎన్నికలో గెలుపు కోసం ఏడుగురు మంత్రులను అక్కడే మకాం వేయించేందుకు గులాబీ బాస్​ వ్యూహం వేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్పుతున్నారు. మంత్రులు కేటీఆర్​, హరీశ్​రావుతో పాటుగా జగదీష్​రెడ్డి, నిరంజన్​రెడ్డి, తలసాని శ్రీనివాస్​ యాదవ్​, పువ్వాడ అజయ్​, గంగుల కమలాకర్​ను అక్కడే మోహరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఎమ్మెల్యేలను నియమించిన సీఎం… ఇప్పుడు మంత్రులకు టార్గెట్​ పెడుతున్నట్లు సమాచారం.

టికెట్​ కోసం..?

ఇక సాగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిని దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం టీఆర్ఎస్ వేట మొదలుపెట్టింది. యాదవ, రెడ్డి వర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలో సీఎం కేసీఆర్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్​లో యాదవ వర్గం ఓట్లు దాదాపు 55 వేలు ఉన్నాయి. కానీ సెగ్మెంట్ లో రెడ్డి లీడర్లు బలంగా ఉన్నారు. దీంతో ఏ కులం వాళ్లకు టికెట్ ఇస్తే బాగుంటుదని నిఘా వర్గాల నుంచి కేసీఆర్​ ఇప్పటికే రిపోర్టు తెప్పించుకున్నట్టు పార్టీ నేతల టాక్​. యాదవ కులం నుంచి నోముల నర్సింహయ్య కొడుకు భగత్​తో పాటు గురువయ్య యాదవ్, రంజిత్ యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి… నోముల కొడుక్కే టికెట్​ ఇవ్వాలని, సామాజికవర్గం ఓట్లతో పాటుగా సానుభూతి కలిసి వస్తుందని పట్టుపడుతున్నారు. మంత్రి జగదీష్​రెడ్డి మాత్రం రెడ్డి కులం నుంచి ఎమ్మెల్సీ తేర చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి పేర్లను ప్రపోజ్​ చేస్తున్నారు. అటు బడుగుల లింగయ్య యాదవ్​ కూడా గురవయ్య యాదవ్​ కోసం సీఎం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్​ నేడో… రేపు ఉదయమో పార్టీ నేతలతో సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే గుత్తా, మంత్రి జగదీష్​రెడ్డితో పాటు నేతలను ప్రగతిభవన్​కు రావాలంటూ సమాచారమందించారు. సాగర్​లో నేటి నుంచి నామినేషన్ల పర్వం మొదలైన విషయం తెలిసిందే.


Next Story

Most Viewed