కేసీఆర్ వ్యూహం.. టార్గెట్​ 2023

by  |
KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. మంత్రి ఈటల రాజేందర్​వ్యవహారంలో పార్టీకి… ప్రభుత్వానికి అపవాదు రాకుండా చేసేందుకు గులాబీ బాస్​ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీని కోసం బీసీ అస్త్రాన్నే తెరపైకి తీసుకురానున్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఉన్న బీసీ ఓటర్లు, జనాభాను అంచనా వేసుకుంటూ వ్యూహం మార్చుతున్నారు. దీనికోసం నిఘా వర్గాలను సైతం రంగంలోకి దింపుతున్నారు.

ఎక్కడ… ఎవరెవరు..?

రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో బలమైన వర్గాలపై సమాచార సేకరణ మొదలైంది. ఈటల వ్యవహారానికి ముందే పక్కా స్కెచ్​తో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది రోజుల నుంచే ఆయా సెగ్మెంట్లలో పరిశీలన చేపట్టారు. ఏ నియోజకవర్గాలో బీసీలు బలంగా ఉన్నారు, ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అంశాలన్నింటినీ క్షేత్రస్థాయి నుంచి నివేదికను రూపొందిస్తున్నారు. వచ్చే ఎన్నికలు లక్ష్యంగా ఈ వ్యూహానికి దిగినట్లు తెలుస్తోంది. ఆయా సెగ్మెంట్లలో బలమైన వర్గానికి ఇప్పటి నుంచి ప్రోత్సాహం ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అవసరమైతే ఆ ప్రాంతాల్లో పార్టీ అభ్యర్థులకు అక్కడి బలాబలాలను బట్టి టికెట్లు కేటాయించాలని భావిస్తున్నారు. దీంతో పలు చోట్ల ఈసారి అధికార పార్టీలో అభ్యర్థుల మార్పు ఉంటుందంటున్నారు.

నామినేటెడ్​పోస్టుల్లో ప్రాధాన్యం

త్వరలోనే రాష్ట్రంలో దాదాపు 45 కార్పొరేషన్లు, వివిధ సంస్థలకు నామినేటేడ్​ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ పదవులతో పాటు ఈ నామినేటెడ్​పోస్టులను ఈసారి బీసీ వర్గాలకు ఎక్కువగా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయా వర్గాలకు అవకాశం కల్పిస్తే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనుకుంటున్నారు.

వ్యూహం మార్చుతున్నారు

వచ్చే 2023 ఎన్నికలే టార్గెట్‌గా గులాబీ బాస్​వ్యూహం మార్చినట్లు పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీలో ఈటల రాజేందర్​వ్యవహారం బీసీల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తుందనే అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నారు. బీసీలను టార్గెట్​చేస్తున్నారనే అపవాదు రాకుండా చేసుకునేందుకు గులాబీ నేత పక్కా ప్లాన్​వేస్తున్నట్లు నేతలు చెప్పుకుంటున్నారు. ఈటల వ్యవహారం బీసీల్లో కొంత ఆగ్రహం తెప్పిస్తుందని ముందుగానే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారికి ప్రాధాన్యత ఇచ్చి ఈ అపవాదును తొలగించుకోవాలని భావిస్తున్నారు. పార్టీలో బీసీ వర్గాలకు పెద్దపీట వేయడం, వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో జనరల్​అయినా బీసీ నేతలనే బరిలోకి దింపడం వంటి వ్యూహాలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే పలు సెగ్మెంట్లలో ఇప్పటికే నిఘా వర్గాలు ఐదారుగురు బీసీ నేతల జాబితా పట్టుకుని వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తీసుకునేందుకు సీఎం మరింత పక్కాగా ఆదేశాలిచ్చినట్లు నిఘా వర్గాల సమాచారం.


Next Story

Most Viewed