తెలంగాణను పశ్చిమబెంగాల్‌లా మార్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్: ఈటల రాజేందర్

by  |
తెలంగాణను పశ్చిమబెంగాల్‌లా మార్చే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్: ఈటల రాజేందర్
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్/కొల్లాపూర్: దిష్టి బొమ్మను తగల బెట్టి.. చావు డప్పులు మ్రోగించాల్సి వస్తే ముందుగా కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయాలి.. ఆయన ఇంటి ముందు, ప్రగతి భవనం ముందు చావు డప్పులు మ్రోగించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ముఖ్యమంత్రి అంటే శాంతిభద్రతలు, ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడుతూ.. స్వేచ్ఛకు రక్షణ కల్పించాలి. అటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రగతి భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ మీద దాడులు చేయమని, దేశ ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేసి చావు డప్పు కొట్టమని పిలుపునివ్వడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

ఒకరకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలా రాష్ట్ర పరిస్థితులను తీసుకొచ్చేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈటల ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతు పండించిన ప్రతి గింజ కొంటుందని గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని, మేము మధ్యవర్తులుగా ఉన్నామని ఎందుకు చెప్పలేదని ఈటల ప్రశ్నించారు. అన్నీ సవ్యంగా సాగితే ఆ విజయం తనదిగా చెప్పుకొని.. పరిస్థితులు చేయి దాటితే ఆ నేరం కేంద్రం పై మోపుతారన్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను, ప్రతి దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అని చెప్పి మోసం చేసినందుకు ముందుగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలన్నారు.

అలాగే ప్రగతి భవన్ ముందు, అవసరమైతే ఆయన ఇంటి ముందు చావు డప్పు మ్రోగించాలని ఈటల కోరారు. హుజురాబాద్ దెబ్బకు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చావు.. ఇంకొంచెం బయటకు రా.. భూమి మీద తిరుగు మారువేషంలో ప్రజా సమస్యలను గురించి తెలుసుకో అని ఈటల ముఖ్యమంత్రికి సూచించారు. మంత్రులకు స్వతంత్రము ఇవ్వు.. వారి పనులను వారిని చేసుకొనివ్వు అని సూచించారు. ప్రజలారా ముఖ్యమంత్రి కేసీఆర్ మతి తప్పి చేస్తున్న పనులను గుర్తించండని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బంగారు శృతి, సుధాకర్ రావు, దిలీప్, కొల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed