తెలంగాణ బీసీ కమిషన్ తో కర్ణాటక బీసీ కమిషన్ భేటీ

by  |
తెలంగాణ బీసీ కమిషన్ తో కర్ణాటక బీసీ కమిషన్ భేటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ బీసీ కమిషన్ తో కర్ణాటక బీసీ కమిషన్ భేటీ అయింది. రాష్ట్రంలో అమలు లోని సంక్షేమ పథకాలు, బీసీ కమిషన్ పనితీరును తెలుసుకునేందుకు కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులు వచ్చారు. గురువారం హైదరాబాద్ లోని బీసీ కమిషన్ భవన్ లో కమిషన్ తో కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ బృందం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.

కేంద్రం జనగణనలో కుల డేటా సేకరణపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ త్వరలో దక్షిణాది రాష్ట్రాల బీసీ కమిషన్ ల సమావేశం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టీఓఆర్ ఆధారంగా నిర్దిష్టమైన అధ్యయనం మొదలు పెట్టినట్లు తెలిపారు. సమగ్రంగా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బీసీలకు బాసటగా తెలంగాణ దేశానికి మార్గదర్శకం గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

సభ్యులు కోతి కిషోర్ గౌడ్, సీహెచ్. ఉపేంద్ర, శుభ ప్రద పటేల్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఎంబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా కుల గణన చేపట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రాన్ని కోరిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే అన్నారు. నాణ్యమైన విద్యను మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాలల ద్వారా ఉత్తమంగా అందిస్తున్న రాష్ట్రం కేవలం తెలంగాణ ప్రభుత్వమే అని పేర్కొన్నారు.

కల్యాణ లక్ష్మి, రెసిడెన్షియల్ పాఠశాలలు, బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల పై బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్ జయ ప్రకాష్ హెగ్డే .. తెలంగాణలో అమలులో ఉన్న అనాధల రిజర్వేషన్లపై వివరాలు తెలుసుకున్నారు. కర్ణాటకకు చెందిన ప్రామాణికమైన బీసీ కమిషన్లు అయిన చిన్నపరెడ్డి, హవనూర్ కమిషన్ నివేదికల తెలుగు అనువాద ప్రతులను అందజేశారు.

తెలంగాణ బీసీ కమిషన్ కర్ణాటక రాష్ట్రాన్ని సందర్శించాలని చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే కోరారు. నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర కమిషన్ చైర్మన్లు, సభ్యులు సిద్దిపేట జిల్లాలోని వర్గల్ లోగల మహాత్మా జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాల సందర్శించనున్నారు. కార్యక్రమంలో కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులు రాజశేఖర్, ఎస్.హెచ్.కళ్యాణ్ కుమార్, అరుణ్ కుమార్, సువర్ణ పాల్గొన్నారు.


Next Story

Most Viewed