సింగరేణిలో ఉద్యోగాల జాతర

by  |
సింగరేణిలో ఉద్యోగాల జాతర
X

దిశ ప్రతినిధి, ఖమ్మం/బెల్లంపల్లి : ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 651 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వివరాలు తెలియజేశారు. ఈ రిక్రూట్‌‌మెంట్‌ ప్రక్రియ మొత్తం మార్చి 2021 నాటికి పూర్తి చేస్తామని, అన్ని పోస్టులకూ రాత పరీక్ష నిర్వహించి దానిలో ప్రతిభ చూపిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వివరించారు. 651 ఖాళీలలో 569 ఎన్‌సీడబ్ల్యూఏ పరిధిలోని ఉద్యోగాలని, 82 అధికార పోస్టులు ఉన్నాయని, ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా వీటిని భర్తీ చేయనున్నామని తెలిపారు.

569 కార్మిక పోస్టుల వివరాలు
జూనియర్‌ అసిస్టెంట్(క్లర్కులు)-177, ఫిట్టర్లు-128, ఎలక్ట్రిషీయన్లు టైనీలు-51, వెల్డర్ ట్రైనీలు-54, టర్నర్‌/మెషినిస్టు ట్రైనీలు-22, మోటర్‌ మెకానిక్‌ ట్రైనీలు-14, మౌల్డర్ ట్రైనీలు-19 పోస్టులను ఎంపిక చేయనున్నారు. జూనియర్‌ స్టాఫ్‌‌నర్స్‌-84 పోస్టులు, ల్యాబ్‌ టెక్నిషీయన్లు-7, ఫార్మాసిస్టులు-5, అలాగే ఎక్స్‌-రే, ఈసీజీ, వెంటిలేటర్‌ విభాగాల్లో రెండేసి పోస్టులు, ఫిజియోథెరపీ, వెంటిలేటర్‌ విభాగంలో ఒక్కొక్క పోస్టును భర్తీ చేయనున్నారు.

82 అధికార పోస్టుల వివరాలు
మైనింగ్‌ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీలు-39 పోస్టులు, పర్సనల్‌ ఆఫీసర్‌-17, మేనేజ్‌మెంట్ ట్రైనీలు(ఇండస్ట్రీయల్‌ ఇంజనీరింగ్‌)-10, సివిల్‌ శాఖలో మేనేజ్‌మెంట్ ట్రైనీలు-7, మేనేజ్‌మెంట్ ట్రైనీలు(ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)-6, జూనియర్‌ అటవీ అధికారి-3 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

ఇంటర్నల్‌ అభ్యర్థుల కోసం..
సీఎం ఇచ్చిన హామీ మేరకు వివిధ గనులు, విభాగాలు, కార్యాయాలల్లో ఖాళీగా ఉన్న 1,436 పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థుల కోసం గుర్తించి, వారితోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సీఎండీ తెలిపారు. ఈ మేరకు త్వరలోనే ఇంటర్నల్‌ సర్క్యూలర్ల ద్వారా ధరఖాస్తులను ఆహ్వానించి, నియామకాలు చేపట్టనున్నామని ఆయన వివరించారు.

ప్రత్యేక రాష్ట్రంలో13,934 ఉద్యోగాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 13,934 ఉద్యోగాలను కల్పించి రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వ సంస్థగా సింగరేణి నిలిచింది. సీఎం ఆదేశం మేరకు కారుణ్య ఉద్యోగల నియామకల ప్రక్రియ కింద ఇప్పటివరకూ 10,879 ఉద్యోగాలు కల్పించగా, 45 ఎక్స్‌టర్నల్‌ రిక్రూట్‌‌మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసి 3,055 మంది యువతను ఉద్యోగాలలో నియమించింది. కాగా తాజాగా కంపెనీ మరో 651 పోస్టులను డైరెక్టు రిక్రూట్‌‌మెంట్‌ ద్వారా మార్చి 2021 నాటికి భర్తీ చేయనుంది. కాగా 75 ఇంటర్నల్‌ నోటిఫికేషన్ల ద్వారా ఇంటర్నల్‌ అభ్యర్థులకు 2,501 ఉద్యోగాల కల్పించింది. అలాగే తాజా ఇంటర్నల్‌ రిక్రూట్‌‌మెంట్‌ ద్వారా మరో 1,436 పోస్టులను మార్చికల్లా భర్తీ చేయనుంది. ఇవికూడా పూర్తయితే మార్చి 2021 నాటికి సింగరేణి సంస్థ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్తగా కల్పించిన ఉద్యోగాల సంఖ్య 18,522 చేరనుంది. దీనిపై సింగరేణి కార్మికులు వారి కుటుంబ సభ్యులతో పాటు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


Next Story

Most Viewed