‘నిధులు కేంద్రానివి.. బొమ్మ కేసీఆర్‌ది’

by  |
‘నిధులు కేంద్రానివి.. బొమ్మ కేసీఆర్‌ది’
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: రాష్ట్రంలో గొర్లు, బర్లు, చేపల పెంపకానికి కేంద్రం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ పనులకు త‌న బొమ్మ పెట్టుకొని పబ్బం గడుపుతున్నార‌ని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. ప‌ట్టణాభి వృద్ధిలోనూ కేంద్రం వాటానే అధికమ‌న్నారు. హ‌న్మకొండ వెంక‌టేశ్వర కాల‌నీలోని బీజేపీ ఎమ్మెల్సీ కార్యాల‌యంలో అర్బ‌న్ జిల్లా అధ్య‌క్షురాలు రావు ప‌ద్మ అధ్య‌క్ష‌త‌న మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ యువత మొత్తం బీజేపీతోనే ఉంద‌న్నారు. రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల‌తోపాటు, నాగార్జున సాగర్‌లో కూడా బీజేపీ జెండా ఎగురుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ప‌ల్లా నిత్యం కేసీఆర్ చుట్టూ తిరగడం తప్ప ఏ రోజూ ప్రజల కోసం పని చేయలేద‌న్నారు.

వ్యవసాయ, విద్య, వైద్య రంగాల‌తోపాటు ర‌హ‌దారుల అభివృద్ధికి కేంద్ర‌మే నిధులు ఇస్తుంద‌న్నారు. లైఫ్ స్టాక్ కోసం ప్రతి ఏడాది కేంద్రం రూ.4వేల కోట్లు ఇస్తుంద‌న్నారు. గ్రామాల్లో 15వ ప్రణాళిక సంఘం పేరుతో వచ్చే నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని తెలిపారు. వరంగల్ ప‌ట్ట‌ణంలో స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ పథకం ద్వారా నిధులు మంజూరు చేస్తే వాటిని పాల‌కులు పక్కదారి పట్టించార‌ని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులు పక్కదారి ప‌ట్ట‌కుండా ఆపాలంటే బీజేపీ గెలవాల‌న్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అని, ఆయనను గెలిపిస్తే యువ‌త క‌ష్టాలు తీరుతాయ‌ని తెలిపారు.



Next Story

Most Viewed