రైతులకు, కస్టమర్లకు వారధిగా ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ బాస్కెట్’

by  |
రైతులకు, కస్టమర్లకు వారధిగా ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ బాస్కెట్’
X

దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలో పంట పండించిన రైతులకు తగినంత లాభం దక్కడం లేదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. తాను పండించిన బియ్యాన్ని మార్కెటర్స్‌కు అమ్మడం వల్ల రైతు నష్టపోతున్నాడు. మార్కెట్‌లో పాలిష్ చేయని బియ్యానికి డిమాండ్ పెరగడంతో రైతుకు దక్కాల్సిన లాభాలు మార్కెటర్స్‌కు దక్కుతున్నాయి. అలా కాకుండా రైతుకు, కస్టమర్‌కు మధ్య ఎలాంటి మీడియేటర్స్ లేకపోతే ఇద్దరూ లాభపడతారు. జగిత్యాల జిల్లాకు చెందిన ఓ జంట అలాంటి వారిధినే నిర్మించారు. వారు మొదలుపెట్టిన స్టార్టప్.. ఇటు రైతులకు, అటు కస్టమర్లకు ఏ విధంగా లాభం చేకూరుస్తుందో తెలుసుకుందాం.

జగిత్యాల జిల్లా, పూడూర్ గ్రామానికి చెందిన గణేష్, తన భార్య మౌనికతో కలిసి ‘ఫార్మర్స్ బ్రిడ్జ్ బాస్కెట్’ పేరుతో మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీనివల్ల రైతు నేరుగా తన అన్ పాలిష్ట్ బియ్యాన్ని కస్టమర్‌కు అమ్మేయొచ్చు. వీళ్లిద్దరి మధ్య దళారులు, మార్కెటర్స్ ఉండరు. ఇదే పేరుతో వాట్సాప్‌లోనూ ఓ గ్రూపు ప్రారంభించిన గణేష్.. ఆ ప్లాట్‌ఫామ్ నుంచి కూడా నేరుగా ఆర్డర్స్ తీసుకుంటున్నాడు. కస్టమర్లు ఆర్డర్ చేసిన 4 నుంచి 15 రోజుల్లో బియ్యం డోర్ డెలివరీ అయిపోతాయి. కాగా కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన దాదాపు 200 మంది రైతులతో ఈ ‘ఫార్మర్స్ బ్రిడ్జ్’ ఒప్పందం కుదుర్చుకుంది.

రైతులు తాము పండించిన ధాన్యాన్ని బ్యాగుల్లో నింపి తమ ఇళ్లల్లోనే స్టోర్ చేసుకోవాలని, అలా రైస్ స్టోర్ చేసుకునే అవకాశం లేని వారికి రైస్ బ్యాంకు ప్లాన్ చేస్తున్నామని, రైతులు అక్కడ స్టోర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని బ్రిడ్జ్ ఫార్మర్ నిర్వాహకుడు గణేష్ తెలిపారు. ఆర్డర్లు వచ్చినప్పుడు రైతుల ఇళ్ల వద్ద నుంచే కస్టమర్ ఇంటికి సప్లయ్ చేస్తామని వెల్లడించాడు. డెలివరీ, కమిషన్‌తో కలుపుకుని తగిన రేట్లను నిర్ణయించామన్నాడు. ప్రతి 25 కిలోల బ్యాగు మీద డెలివరీ చార్జీలు 50 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికైతే కనీసం క్వింటాల్ ఆర్డర్ ఉంటే సప్లయ్ చేస్తున్నట్టు తెలిపిన గణేష్.. భవిష్యత్తులో 25 కేజీల ఆర్డర్ కూడా తీసుకుంటామన్నాడు. జైశ్రీరాం, తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్‌ఎమ్‌టీలతో పాటు ఇతర వెరైటీలు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించాడు.

‘అన్‌పాలిష్డ్ రైస్‌ మార్కెట్‌లో చాలా తక్కువగా లభిస్తున్నాయి. మా ఇంట్లో కూడా అన్‌పాలిష్ట్ బియ్యాన్నే తింటాం. ప్రస్తుతం ప్రజలకు కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అన్ పాలిష్డ్ రైస్ తినడానికే ఇష్టపడుతుండటంతో మార్కెట్లో అన్ పాలిష్డ్ రైస్‌కు కొరత ఏర్పడింది. రైతులు మార్కెటర్స్‌కు అన్ పాలిష్డ్ బియ్యాన్ని విక్రయిచండం వల్ల వారికి లాభం ఉండదు. ఈ క్రమంలోనే అటు రైతులకు లాభం చేకూర్చుతూ, ఇటు కస్టమర్లకు తక్కువగా లభిస్తున్న బియ్యాన్ని అందించేందుకు మేం ఈ వారిధిని నెలకొల్పాం’ అని మౌనిక తెలిపింది.

ఆర్డర్స్ ఎక్కువగా హైదరాబాద్ నుంచే వస్తున్నట్లు తెలిపిన ఆ జంట.. ఆర్డర్స్ కోసం 9441558550 వాట్సాప్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


Next Story