అమిత్‌షాతో జగన్ భేటీ ‘వయా’ మోదీ.!

by  |
అమిత్‌షాతో జగన్ భేటీ ‘వయా’ మోదీ.!
X

వరుస భేటీలు.. తీరికలేని చర్చలతో ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కీలక నేతలతో మాట్లాడుతూ రాష్ట్రానికి అవసరమైన అంశాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుంచుతున్నారు. జగన్ గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనను సంపూర్ణం చేసే దిశగా శుక్రవారం అమిత్‌షాతో భేటీకి సిద్ధమయ్యారు. కాగా మూడు రాజధానులు, శాసన మండలి అంశాలే ఈ పర్యటనలో కీలకం కానున్నాయి. అయితే, ప్రధాని మోదీ ముందుంచిన అభ్యర్థనలే అమిత్‌షా ముందు కూడా ఉంచబోతున్నారా?.. ఇంకా ఏవైనా ఇతర కారణాలున్నాయా.!? తెలియాల్సి ఉంది.

ప్రధానితో భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి ఆయనకు వివరించడంతో పాటు అమరావతి పరిధిలో జరుగుతున్న ఆందోళనలపై టీడీపీ చేస్తున్న విమర్శలను జగన్ ఏకరువు పెట్టారు. ఇవే అంశాలను కేంద్ర హోం శాఖ మంత్రి వద్ద కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రానికి ఎంతటి ప్రాముఖ్యత గల అంశమో అమిత్‌షాకు వివరిస్తూ కేంద్రం నుంచి సాయం కోరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో శాసన సభ్యులు ఆమోదించిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ప్రతిపక్ష టీడీపీ అడ్డుకున్న విధానాన్ని అమిత్‌షా వద్ద విన్నవించి శాసన మండలి రద్దుకు కేంద్రం పూర్తి మద్దతు కోరనున్నట్టు తెలుస్తోంది. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ‘దిశ చట్టం’ రూపుదిద్దుకునేందుకు అవసరమైన పాలనాపరమైన సహకారాన్ని కోరనున్నట్టు సమాచారం. అంతేకాక ఇన్నాళ్లు స్తబ్దుగా ఉంచిన ప్రత్యేకహోదా అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నాయి. ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునేందుకు ‘ప్రత్యేకహోదా’ ప్రకటించాలనే డిమాండ్‌ను అమిత్‌షా ముందు ఉంచనున్నారు.

మరో ఆసక్తికరమైన అంశం కూడా రాజకీయ విశ్లేషకుల నడుమ నలుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘సీఏఏ, ఎన్నార్సీ’లపై ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వైఎస్ జగన్ ఎన్నార్సీని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో ఈ అంశంపై మాటలు కలుపుతారా? ఒకవేళ ఈ అంశం వీరి మధ్య చర్చకు వస్తే జగన్ వైఖరి పట్ల అమిత్‌షా ఎలాంటి అభిప్రాయాన్ని వెలిబుచ్చనున్నారు? టీడీపీని మరింత బలహీన పరిచే విధంగా భవిష్యత్తులో జగన్ నిర్ణయాలు ఉండబోతున్నాయా.. అందుకే అమిత్‌షాను కలుస్తున్నారా? జగన్ ప్రత్యేకంగా హోంమంత్రిని కలవడానికి ఇంకేమైనా కారణాలున్నాయా? ఇలా ‘అమిత్‌షాతో వైఎస్ జగన్ భేటీ వయా మోదీ’ అనేకానేక ప్రశ్నలను సంధిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story