NSO ఆఫీసుల్లో ఇజ్రాయెల్ అధికారుల తనిఖీలు

by  |
israel
X

టెల్ అవీవ్ : పెగాసస్ స్పైవేర్‌ను అభివృద్ధి చేసిన ఇజ్రాయెలీ సంస్థ NSO కార్యాలయాల్లో ఆ దేశ రక్షణ అధికారులు తనిఖీలు చేశారు. టెల్ అవీవ్ సమీపంలోని ఎన్ఎస్‌వో ఆఫీసుల ప్రాంగణంలో రైడ్స్ చేసినట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. 17 మీడియా సంస్థలు కలిసి పెగాసస్‌పై ప్రచురించిన సంచలన కథనాలు, ఆరోపణలకు స్పందనగానే తనిఖీలు చేసినట్టు తెలిపింది. ఎన్ఎస్‌వో కూడా తనిఖీలను ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ అధికారులు తమ కార్యాలయాలను విజిట్ చేశారని పేర్కొంది. ఇజ్రాయెల్ అధికారులతో తమ కంపెనీ పారదర్శకంగా సహకరిస్తున్నట్టు వివరించింది.

ఎన్ఎస్‌వో నుంచి లీక్ అయినట్టుగా చెబుతున్న డేటాను ఫ్రాన్స్ స్వచ్ఛంద సంస్థ ఫర్‌బిడెన్ స్టోరీస్, ఆమ్నెస్టీ సహా 17 సంస్థలు కలిసి కథనాలుగా ప్రచురించాయి. పెగాసస్‌ను ఉపయోగించి ప్రభుత్వాలు ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, ఇతరులపై నిఘా వేస్తున్నదని ఆరోపించాయి. సొంతపౌరులపైనే గూఢచర్యానికి దిగాయని పేర్కొన్నాయి. మీడియా సంస్థల ఆరోపణలను ఎన్ఎస్‌వో పలుమార్లు కొట్టేసింది. ఇజ్రాయెల్ తనిఖీలు తమ వాదనను మరోసారి నిరూపిస్తాయని తెలిపింది. ఆమ్నెస్టీ కూడా ఇటీవలే స్పందిస్తూ తమకు అందిన సమాచారాన్నే ప్రచురిస్తున్నామని, కట్టుకథల్లేవని స్పష్టం చేసింది.


Next Story

Most Viewed