ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం.. అందుకే ఓకే

by  |
ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం.. అందుకే ఓకే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని కంపెనీలకు ఊరట కలిగించేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ(ఐఆర్‌డీఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య రక్షణ కోసం ఉద్యోగులకు తీపి కబురందించింది. ఇటీవల కరోనా నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిన కరోనా కవచ్ పాలసీని ఇకమీదట కంపెనీలకు సైతం గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్‌గా అందించేందుకు అనుమతించింది. దీనికి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు ఉత్తర్వులను జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో చిన్నా చితక కంపెనీల నుంచి బడా కంపెనీల వరకూ అన్నిటికీ ఊరట లభించనుంది. తత్ఫలితంగా కరోనా చికిత్స కోసం అయ్యే లక్షల ఖర్చు నుంచి కంపెనీలకు, ఉద్యోగులకు ఆర్థిక భారత తగ్గిపోనుంది. ఎందుకంటే, ఇప్పటివరకు చాలా ఆస్పత్రులు స్పష్టమైన ఆదేశాలు లేని కారణంగా కరోనా చికిత్స కోసం నగదును మాత్రమే తీసుకుంటున్నాయి. దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. తాజా నిర్ణయంతో సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలు నిరభ్యంతరంగా కరోనా కవచ్ పాలసీని గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీగా విక్రయించే అవకాశముంటుంది. ఈ నెలలోనే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు కరోనా చికిత్స కోసమే ఉద్దేశించినవి. అయితే, ఇప్పటివరకూ ఇవి కేవలం వ్యక్తిగత, కుటుంబ పాలసీలుగా మాత్రమే అనుమతించబడ్డాయి. 105 రోజులు, 195 రోజులు, 285 రోజుల కాలపరిమితి కింద జారీ అవుతున్నాయి. వీటికి గరిష్టంగా రూ. 5 లక్షల కవరేజ్ లభిస్తోంది. అలాగే, ఈ పాలసీలను రోజు వయసున్న పిల్లల నుంచి 65 ఏళ్ల వయసున్న వారికి వర్తిస్తుంది. నగదురహితంగా కూడా ఈ పాలసీ పనిచేస్తోంది. ఇన్ని సదుపాయాలతో ముందుకొచ్చిన ఈ పాలసీ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. దీన్ని ఉద్యోగులందరికీ అనుమతిస్తూ నిర్ణయం తీసుకుని కంపెనీలకు ఊరటనిచ్చింది.

హెల్త్ వర్కర్లకు డిస్కౌంట్…

కరోనా కవచ్ పాలసీలను విక్రయించడానికి గత వారం ఐఆర్‌డీఏఐ బీమా కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీగా ఇవ్వడానికి కవచ్ పాలసీలో గ్రూప్ అనే పదాన్ని చేర్చాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రీమియం మినహాయించి ఇతర అన్ని నిబంధనలు సాధారణ స్టాండర్డ్ పాలసీకి వర్తించే అన్ని నిబంధనలు దీనిక్కూడా వర్తించనున్నాయి. ఏదైనా కంపెనీలో అందరూ మెడికల్ సిబ్బంది, డాక్టర్లు మాత్రమే ఉంటే వారికిచ్చే గ్రూప్ పాలసీ ప్రీమియంలో 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. కరోనా మహమ్మారిపై పోరాటంలో మెడికల్ సిబ్బంది, డాక్టర్లు చేస్తున్న కృషికి గుర్తింపు కల్పిస్తూ ఈ డిస్కౌంట్ నిబంధన చేర్చినట్టు ఐఆర్‌డీఏఐ తెలిపింది.

కరోనా భయంతో ఆఫీసులకు దూరంగా…

కరోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఆయా కంపెనీల్లోని ఉద్యోగులకు తగిన ఆరోగ్య బీమా పాలసీలు ఉండకపోవడం సమస్యగా మారింది. అలాగే, కంపెనీలు స్వయంగా ప్రతి ఉద్యోగికి పాలసీ అందించే పరిస్థితి కూడా లేదు. ఇప్పటికే కరోనా దెబ్బకు నష్టాల్లో ఉండటం, తిరిగి ప్రారంభం తర్వాత నిర్వహణ లాంటి అదనపు ఖర్చులతో నెగ్గుకొస్తున్న కంపెనీలకు ఇది అదనపు భారంగా మారుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణాలతోనే, తాజాగా ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన గ్రూప్ పాలసీ కరోనా సంక్షోభం సమయంలో పెద్ద ఊరటగా కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా వ్యాప్తి విపరీతంగా పెరుగుతున్న సమయంలో కంపెనీలు, సంస్థలు తిరిగి ప్రారంభమైనప్పటికీ ఉద్యోగులు ఎక్కువమంది కార్యాలయాలకు వచ్చి పనిచేయడానికి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి కంపెనీలోని ఎక్కువ భాగం మంది విధులకు దూరంగా ఉంటూ, వీలైనంత ఎక్కువగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కంపెనీలను కొనసాగించేందుకే యజమానులు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ కరోనా పాలసీ వల్ల చిన్న కంపెనీతో సహా దేశవ్యాప్తంగా అనేక కంపెనీలకు కొంత ఊరట లభించనున్నట్టు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed