IPL 2026: ఎట్టకేలకు కేకేఆర్ బోణి.. ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై విజయం

by Gantepaka Srikanth |

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన రసవత్తర పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది.

IPL 2026: ఎట్టకేలకు కేకేఆర్ బోణి.. ఉత్కంఠ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై  విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం జరిగిన రసవత్తర పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) అద్భుత విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడిన కేకేఆర్, ఓటమి అంచుల్లో నుంచి గెలిచి అభిమానులను ఉర్రూతలూగించింది. 'ఫినిషర్' రింకూ సింగ్(53) మరోసారి తన అసాధారణ పోరాటంతో జట్టును గెలిపించి హీరోగా నిలిచాడు. 156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. రాజస్థాన్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ధాటికి కేకేఆర్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఒక దశలో విజయం రాజస్థాన్ వైపు మొగ్గు చూపుతున్న తరుణంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడిన రింకూ సింగ్, రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో వరుస బౌండరీలతో సమీకరణాన్ని కోల్‌కతా వైపు తిప్పాడు.

అనుకుల్ రాయ్ కీలక సహకారం..

రింకూకు తోడుగా అనుకుల్ రాయ్(29) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కీలక సమయంలో సింగిల్స్ తీస్తూ, అవకాశం దొరికినప్పుడు బౌండరీలు కొడుతూ రింకూపై ఒత్తిడి పడకుండా చూశాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న కీలక భాగస్వామ్యం కోల్‌కతాను గెలుపు తీరాలకు చేర్చింది. అంతకుముందు గ్రీన్ (27), పావెల్ (23) కూడా పర్వలేదనిపించారు. సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సాధించిన ఈ విజయం కేకేఆర్ శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ గెలుపుతో కోల్‌కతా ఐపీఎల్‌లో బోణి కొట్టింది. అసాధ్యమైన విజయాన్ని సుసాధ్యం చేసిన రింకూ సింగ్‌ను కేకేఆర్ యాజమాన్యం, ఆటగాళ్లు అభినందనలతో ముంచెత్తారు.

Next Story