ముంబై ఘోర ఓటమి.. KKR ప్లే ఆఫ్ ఆశలు సజీవం

by Muthe.Rajitha |

IPL 2026 సీజన్లో నేడు జరిగిన మ్యాచులో ముంబై తన హోం గ్రౌండ్స్ లో ఘోర ఓటమి పాలైంది.

ముంబై ఘోర ఓటమి.. KKR ప్లే ఆఫ్ ఆశలు సజీవం
X

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో నేడు జరిగిన మ్యాచులో ముంబై తన హోం గ్రౌండ్స్ లో ఘోర ఓటమి పాలైంది. ముంబయితో జరిగిన అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా మిగిలాయి అని చెప్పవచ్చు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టును కోల్‌కతా బౌలర్లు తక్కువ పరుగులకే కట్టడి చేశారు. ముంబయి బ్యాటర్లలో కార్బిన్‌ బోష్‌ మాత్రమే 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో వేగంగా ఆడి 32 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఫలితంగా ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితం అయింది.

అనంతరం 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అంతగా సహకరించకపోవడంతో స్వల్ప లక్ష్యమే అయినప్పటికీ పరుగులు తీయడానికి కోల్‌కతా బ్యాటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అయితే మిడిల్ ఆర్డర్‌లో మనీష్‌ పాండే (45), అలాగే పావెల్‌ (40) పరుగులత రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబయి బౌలర్లలో కార్బిన్ బోష్‌ బ్యాటింగ్‌తోనే కాకుండా బౌలింగ్‌లోనూ రాణించి 3 వికెట్లు పడగొట్టగా, దీపక్‌ చాహర్‌, జస్‌ప్రీత్ బుమ్రా, ఘజన్‌ ఫర్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.

ప్లే ఆఫ్ ఆశలు సజీవం

ఈ టోర్నీలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు ఇది ఆరో విజయం కాగా, ముంబయి జట్టుకు ఇది తొమ్మిదో ఓటమిగా నమోదైంది. ఈ విజయంతో లభించిన రెండు పాయింట్లతో కోల్‌కతా జట్టు మొత్తం 13 పాయింట్లను సాధించి, పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుండి నేరుగా ఆరో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం కోల్‌కతాకు లీగ్ దశలో ఇంకొక్క మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఆ చివరి మ్యాచ్‌లో మే 24న కోల్‌కతా జట్టు దిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.

Next Story