కరెంటు తీగల కిందే హరితహారం..

by  |
కరెంటు తీగల కిందే హరితహారం..
X

దిశ,చిట్యాల: ప్రకృతిని పచ్చగా, ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణంగా మార్చే శక్తి ఒక్క వృక్షాలకే ఉన్నదనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. వృక్షో రక్షిత రక్షితః వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి మొక్కలు నాటి పెంచి సంరక్షించండి అంటున్న ప్రభుత్వ లక్ష్యం బుగ్గి పాలవుతోంది. విద్యుత్,ఆర్ అండ్ బీ అధికారుల సమన్వయ లోపం కారణంగా వేలాది చెట్లు మధ్యలోనే మోడుగా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు,పట్టణాల్లో,రోడ్ల వెంట పచ్చని చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే, దీనికి భిన్నంగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోందని నాటిన చెట్లను ఆ శాఖ అధికారులు నరికివేస్తున్నారు. ఈ తంతూ ప్రతి ఏటా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, టేకుమట్ల, మొగుల్లపల్లి, రేగొండ మండలాల వ్యాప్తంగా జరుగుతోంది. పెంచిన చెట్లను నరికివేయడం చట్ట వ్యతిరేకమైన, సమన్వయ లోపంతో విద్యుత్ తీగల కింద నాటిన మొక్కలు ఎదిగిన కొన్నాళ్లకే నరికివేతకు గురవుతున్నాయి.

లక్షసాధనలో విద్యుత్ తీగల కింద మొక్కలు

ప్రతి ఏటా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన భాధ్యతను అధికారులకు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. ఈ లక్ష్య సాధనలో విఫలమైనా, నిర్లక్ష్యం చూపినా శాఖాపరమైన చర్యలకు గురి కావాల్సి వస్తోంది. దీంతో ఎలాగైనా లక్ష్యం మేరకు మొక్కలు నాటాలనే తాపత్రయంలో ఏమాత్రం ముందు చూపు లేకుండానే ఏకంగా విద్యుత్‌ వైర్లకిందే మొక్కలు నాటేస్తున్నారు. ఫలితంగా ఏడాదిలోపు విద్యుత్‌ వైర్లను తాకుతున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుండటంతో చెట్లను నరికివేయాల్సిన అవసరం విద్యుత్‌ అధికారులకు ఎదురవుతోంది.

చెట్ల వల్ల విద్యుత్‌కు అంతరాయం

విద్యుత్‌ వైర్లను తాకే చెట్లను నరికివేయకుంటే పలు ఇబ్బందులు, ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తోందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ తీగలకు చెట్ల కొమ్మలు తాకుతుండటంతో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర ఆటంకం కలుగుతోందని, కొన్ని సందర్భాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు లేదా సబ్‌స్టేషన్లు ట్రిప్‌ అవుతున్నాయని, విద్యుత్‌ వైర్లను తాకే చెట్ల ద్వారా పరిసరాలు విద్యుత్ఘాతానికి గురై పెను ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.

చర్యలు శూన్యం ప్రతి ఏటా ఇదే తంతూ

ప్రతి ఏటా మొక్కలు నాటడం అవి పెరిగి చెట్లు‌గా మారడం అనతికాలంలోనే నరికివేతకు గురవడం పరిపాటిగా మారుతోంది. అధికారుల సమన్వయ లోపం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం అభాసుపాలు అవుతోంది. చెట్లు నరికివేతకు గురుకావల్సిన దుస్థితి నెలకొంటున్న దీనికి ప్రత్యామ్నాయ చర్యలు చెపట్టకపోవడం, కఠిన చర్యలు అమలు చేయకపోవడం వల్లనే ప్రతి ఏటా ఆ తంతూ కొనసాగుతూ వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెట్లను రక్షించేలా చర్యలు చేపట్టాలని పర్యవరణ ప్రేమికులు కోరుతున్నారు.


Next Story

Most Viewed