ఆఫ్‌లైన్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది

by  |
ఆఫ్‌లైన్ స్మార్ట్‌ ఫోన్ మార్కెట్ తిరిగి పుంజుకుంటుంది
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి రెండుసార్లు భారత మొబైల్‌ఫోన్ ఆఫ్‌లైన్ పరిశ్రమను ప్రభావితం చేసినప్పటికీ ఈ మార్కెట్‌కు ఉన్న స్వాభావిక బలం దీర్ఘకాలంలో చెక్కుచెదరకుండా ఉంటుందని వివో ఇండియా స్ట్రాటజీ డైరెక్టర్ నిపున్ మరియా చెప్పారు. గతేడాది రెండు నెలలు రిటైల్ స్టోర్లు మూతపడ్డాయని, ఈ ఏడాది సెకెండ్ వేవ్ సుమారు ఒకటిన్నర నెలలు దుకాణాలు మూతబడ్డట్టు ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు స్టోర్లకు వెళ్లేందుకు వెనకాడతారు. దీనివల్ల ఆఫ్‌లైన్ మొబైల్ వ్యాపారాలు నష్టపోతాయి.

అయితే, దీర్ఘకాలికంగా ఆఫ్‌లైన్ మార్కెట్‌కున్న బలం ఇప్పటికీ అంతే స్థిరంగా ఉందని భావిస్తున్నాం. దేశవ్యాప్తంగా వివో బ్రాండ్‌కు సుమారు 70 వేల రిటైల్ స్టోర్లు ఉన్నాయి. తమ అమ్మకాల్లో ఎక్కువభాగం ఆఫ్‌లైన్ రిటైల్ నుంచి జరుగుతాయి. వివో ఇటీవల తన వివో స్మార్ట్ రిటైల్(వీఎస్ఆర్) కార్యక్రమం ద్వారా మే నుంచి జూన్ మధ్య నెల రోజుల్లో లక్ష స్మార్ట్‌ఫోన్‌లను డెలివరీ చేసినట్టు నిపున్ మరియా వివరించారు. దేశీయంగా గతేడాది స్థాయిలో మొబైల్‌ఫోన్ మార్కెట్ మెరుగైన వృద్ధిని సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమ 23 శాతం పెరిగింది. మొత్తం మొబైల్‌ఫోన్ అమ్మకాలు 45 శాతం ఆన్‌లైన్ ద్వారా జరిగాయని తెలిపారు.


Next Story