రైతులకు గుడ్ న్యూస్.. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి

by  |
రైతులకు గుడ్ న్యూస్.. వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండ‌లం ఆలూర్ గ్రామంలో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంద్రకరణ్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్‌ రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని తెలిపారు. మిష‌న్ కాక‌తీయ‌, రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు.

నిర్మల్ జిల్లాలో గ‌తంలో కంటే వ‌రి సాగు చాలా పెరిగింద‌న్నారు. ఈ సీజ‌న్‌లో 1.15 లక్షల ఎక‌రాల్లో వ‌రి సాగు చేశార‌ని, 23 ల‌క్షల క్వింటాళ్ళ దిగుబ‌డి వ‌స్తుంద‌ని వ్యవసాయ శాఖ అధికారులు అంచ‌నా వేశార‌ని మంత్రి తెలిపారు. వ‌రి ధాన్యం కొనుగోళ్ళకు రూ. 427 కోట్ల అంచ‌నా వ్యయం అవుతుంద‌ని పేర్కొన్నారు.



Next Story