9 నెలల కనిష్ఠానికి భారత ఇంధన డిమాండ్

by  |
9 నెలల కనిష్ఠానికి భారత ఇంధన డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోయాయి. దీంతో మే నెలలో భారత ఇంధన డిమాండ్ 9 నెలల కనిష్ఠానికి పడిపోయిందని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ గణాంకాల ప్రకారం.. గతేడాది మేలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో తక్కువ బేస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఈ ఏడాది మేలో ఇంధన డిమాండ్ 1.5 శాతం తగ్గి 1.51 కోట్ల టన్నులకు పడిపోయింది. అంతకుముందు ఏప్రిల్‌లో ఇంధన డిమాండ్ 11.3 శాతం క్షీణించింది. ఈ ఏడాది కరోనా తీవ్రంగా ఉన్నప్పటికీ పరిమితంగా ఆంక్షలు ఉన్నాయి.

అయితే రాష్ట్రాల మధ్య సరుకు సరఫరాలో అంతరాయం వల్ల ఇంఢన డిమాండ్ దెబ్బతిన్నదని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇక, మేలో పెట్రోల్ వినియోగం గతేడాదితో పోలిస్తే 12 శాతం పెరిగి 19.9 లక్షల టన్నులుగా నమోదైంది. ఏప్రిల్‌లో పెట్రోల్ వినియోగం 16 శాతం తగ్గింది. డీజిల్ వినియోగం 55.3 లక్షల టన్నులతో స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్‌లో డీజిల్ 17 శాతం క్షీణించింది. విమాన ఇంధనం 36 శాతం తగ్గి 2.63 లక్షల టన్నులకు చేరుకున్నాయి. గతేడాది మేతో పోలిస్తే ఇది రెట్టింపు ఎక్కువ కావడం గమనార్హం. గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ గ్యాస్ అమ్మకాలు గతేడాదిలాగే మెరుగైన వృద్ధిని నమోదు చేసింది. మేలో మొత్తం 21 లక్షల టన్నులుగా నమోదవగా, ఇది గతేడాది ఇదే నెలతో పోలిస్తే 5.5 శాతం తక్కువ.


Next Story