వచ్చే ఏడాదే వినియోగదారుల విశ్వాసంలో వృద్ధి!

by  |
వచ్చే ఏడాదే వినియోగదారుల విశ్వాసంలో వృద్ధి!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జనవరి నాటికి దేశీయ వినియోగదారుల విశ్వాసం గణనీయంగా మెరుగుపడుతుందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ నివేదిక అభిప్రాయపడింది. జూలై నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, అనంతరం 2021 పండుగ సీజన్ సమయం వరకు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగుతుందని సంస్థ వెల్లడించింది. మెరుగైన ఆదాయం, ఉపాధి, ఖర్చులు వంటి విభాగాల్లో వినియోగదారుల విశ్వాసం పెరగనుందని, కరోనా మహమ్మారి కారణంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వినియోగదారుల ప్రాధాన్యత, కొనుగోలు ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయని, ఆరోగ్యం, సంరక్షణ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యత పెరిగిందని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ వెల్లడించింది.

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ఎల్‌టీసీ క్యాష్ ఓచర్‌లు, ఉద్యోగులకు వడ్డీ లేకుండా రూ. 10 వేల పండుగ అడ్వాన్స్ కార్యక్రమాల ద్వారా ఆర్థికవ్యవస్థకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అధ్యయనం పేర్కొంది. అలాగే, విలువైన వస్తువులు, అవసరమైన ఉత్పత్తుల వినియోగంలో భారీగా మార్పులుంటాయని, డిజిటల్ విక్రయాల ప్రభావం స్పష్టంగా ఉండనుందని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్ దుకాణదారులు డిజిటల్ విధానానికి మారతారని, ముఖ్యంగా వృద్ధులు ఉండే ప్రాంతాల్లో ఈ-కామర్స్ సంస్థలు కిరాణా దుకాణాదారులతో కలిసి డిమాండ్ తీర్చేందుకు సేవలను పెంచుతాయని నివేదిక పేర్కొంది. భవిష్యత్తులో ఈ-కామర్స్ అన్ని రకాల ఉత్పత్తులను డెలివరీ చేస్తూ మరింత వృద్ధి సాధిస్తుందని, వినియోగదారులకు కాంటాక్ట్‌లెస్ సేవలకు అందించనున్నాయని తెలిపింది.

Next Story