ఒలంపిక్ కమిటీ నిర్ణయంతో భారత అథ్లెట్లకు నష్టం

by  |
ఒలంపిక్ కమిటీ నిర్ణయంతో భారత అథ్లెట్లకు నష్టం
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ తీసుకున్న నిర్ణయం భారత అథ్లెట్ల పాలిట శాపంగా మారనున్నది. కరోనా మహమ్మారి కారణంగా విదేశీ క్రీడాకారులను తప్ప ఇతరులను ఎవరినీ జపాన్‌లోకి అడుగుపెట్టనివ్వమని.. విదేశీ ప్రేక్షకులకు కూడా అనుమతి లేదని నిర్వాహక కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు భారత క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న విదేశీ కోచ్‌లను వెంట తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. సాధారణంగా ఒలంపిక్ నిర్వాహక కమిటీ.. ఆయా దేశాల క్రీడా సంఘాల కోచ్, సిబ్బందిని అనుమతిస్తాయి. వారు నేరుగా క్రీడాకారులతో కలసి ఒలంపిక్ విలేజ్‌లో బస చేయవచ్చు. కానీ విదేశీ కోచ్‌లు ఉంటే వాళ్లు సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే ఒలంపిక్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ టికెట్లు కొనుక్కొని.. క్రీడాకారుల దగ్గరకు వెళ్లి అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంటారు.

ఈ సారి ఇండియా నుంచి 150 మంది క్రీడాకారులు ఒలంపిక్స్‌కు వెళ్లే అవకాశం ఉన్నది. ఇందులో చాలా మందికి విదేశీ కోచ్‌లు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం వీళ్లు జపాన్ వెళ్లే పరిస్థితులు లేవు. రెజ్లర్ పునియాకు జార్జియాకు చెందిన బెన్టినిడిస్, పీవీ సింధు, వినేష్ పొగట్ లకు కూడా విదేశీ కోచ్‌లు ఉన్నారు. షూటర్లకు కూడా విదేశీ సపోర్ట్ స్టాఫ్ ఉన్నారు. కేవలం కోచ్‌లే కాకుండా ఫిజియోలు, ట్రైనర్లు చాలా మంది విదేశీయులు ఉన్నారు. వీరందరినీ జపాన్ తీసుకెళ్లే అవకాశం లేదు. కాగా ఈ విషయాన్ని పలువురు అథ్లెట్లు ఇండియన్ ఒలంపిక్ కమిటీ దృష్టికి తీసుకొని వెళ్లారు. నిర్వాహక కమిటీతో ఈ విషయం చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.



Next Story

Most Viewed