టాప్ టెన్‌లోకి భారత్

by  |
టాప్ టెన్‌లోకి భారత్
X

దిశ, న్యూస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి అమలు చేస్తున్ననాల్గోదశ లాక్‌డౌన్‌లో దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసులు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ముందురోజు నమోదైన కేసుల కంటే ఎక్కువ కేసులు పుట్టుకొస్తున్నాయి. గత వారం రోజుల నుంచి ప్రతీరోజు సగటున ఆరు వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. మృతుల విషయంలోనూ ప్రతీరోజు 100కు పైబడే పేషెంట్లు కరోనా కారణంగా చనిపోతున్నారు. నిన్నమొన్నటి వరకూ ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధిత దేశాల్లో టాప్ ట్వంటీలో ఉన్న భారత్.. తాజాగా టాప్ టెన్‌లోకి వచ్చేసింది. గడచిన 24 గంటల్లో ఏకంగా 6,767 కొత్త కేసులు నమోదు కావడంతో, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,31,868కు చేరుకుంది. ఒక్క రోజులోనే 147 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 3,720కు చేరుకుంది.

ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్, రష్యా, స్పెయిన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ ఉన్నాయి. పదో స్థానంలో భారత్ ఉంది. తొలి కరోనా కేసు పుట్టిన చైనా దేశం మాత్రం 14 స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం నాల్గో విడత లాక్‌డౌన్ విధించిన తర్వాత కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రలోనే మూడో వంతు ఉన్నాయి. ఆ తర్వాత తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. అత్యధిక కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలుగా మహారాష్ట్ర, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

మహారాష్ట్రలో ఒక్క రోజులోనే 2,608 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 47 వేలు దాటింది. మృతుల సంఖ్య కూడా అన్ని రాష్ట్రాలకంటే అధికంగా (1577) ఇక్కడే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో 765, ఆంధ్రప్రదేశ్‌లో 66, తెలంగాణలో 41 చొప్పున ఒక రోజులో కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 24 గంటల వ్యవధిలో నలుగురు కరోనా కారణంగా చనిపోయారు. నాల్గో విడత లాక్‌డౌన్ తర్వాత దేశవ్యాప్తంగా నమోదవుతున్న రోజువారీ కేసులు, మృతుల వివరాలను పరిశీలిస్తే…
మే 18 : 5,242 కొత్త కేసులు – 159 మరణాలు
మే 19 : 4,970 కొత్త కేసులు – 134 మరణాలు
మే 20 : 5,611 కొత్త కేసులు – 140 మరణాలు
మే 21 : 5,609 కొత్త కేసులు – 132 మరణాలు
మే 22 : 6,088 కొత్త కేసులు – 148 మరణాలు
మే 23 : 6,654 కొత్త కేసులు – 137 మరణాలు
మే 24 : 6,767 కొత్త కేసులు – 147 మరణాలు

భారత్ :

మొత్తం కేసులు : 1,31,868
రికవరీ : 54,440
మృతులు : 3,867

తెలంగాణ :

మొత్తం కేసులు : 1,854
రికవరీ : 1,092
మృతులు : 53

ఆంధ్రప్రదేశ్ :

మొత్తం కేసులు : 2,627
రికవరీ : 1,807
మృతులు : 56



Next Story

Most Viewed