12 ఏళ్లలో తొలిసారి తగ్గిన కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు

by  |
12 ఏళ్లలో తొలిసారి తగ్గిన కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు
X

దిశ, వెబ్ డెస్క్: తక్కువ పన్ను రేట్లతో పాటు దేశీయంగా వ్యాపారాలపై కొవిడ్ ప్రభావం కారణంగా కార్పొరేట్ పన్ను వసూళ్లు 12 ఏళ్లలో మొదటిసారిగా వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్ల కంటే తక్కువగా నమోదయ్యాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు రూ. 4.57 లక్షల కోట్లుగా నమోదు కాగా, మొత్తం వ్యక్తిగత ఆదాయ పన్నులు రూ. 4.69 లక్షల కోట్లుగా ఉన్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. సమీక్షించిన ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ ఆదాయ పన్ను వసూళ్లు 18 శాతం క్షీణించగా, వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు 2.3 శాతం తగ్గాయి.

2019 సెప్టెంబర్‌లో కేంద్రం కార్పొరేట్ పన్ను రేట్లను 10 శాతం తగ్గించింది. ఇప్పటికే ఉన్న కంపెనీలకు కొత్త కార్పొరేట్ పన్ను రేట్లు 25 శాతం ఉండగా, కొత్త కంపెనీలకు ఇది 17 శాతంగా ఉంది. కరోనా మహమ్మారి కారణంగా పన్ను రేట్లలో తగ్గింపు, జీడీపీ పతనం కారణంగా కార్పొరేట్ పన్ను వసూళ్లు తగ్గేందుకు కారణమైనట్టు నిపుణులు అభిప్రాయపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా కార్యకలాపాలు దెబ్బతినడంతో జీడీపీ 7.3 శాతంతో 40 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

Next Story

Most Viewed