హే.. ట్రంప్‌?

by  |
హే.. ట్రంప్‌?
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. ఎయిర్‌పోర్టు నుంచే మన వారసత్వ సంపద, సంప్రదాయాలను ప్రదర్శిస్తూ ట్రంప్ కుటుంబానికి కళాకారులు స్వాగతం పలికారు. రోడ్ షో సహా.. మొతెరా స్టేడియంలో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోనూ కళల ప్రదర్శన జరిగింది. భారత్.. యావత్‌ప్రపంచాన్ని తన అతిథిగా భావిస్తుందని మన సమాజంలో ఇమిడి ఉన్న సామరస్య, సహోదరభావాన్ని ప్రధాని మోడీ వెల్లడించారు. కానీ, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నాయకులకు, సామాజిక, పౌర హక్కుల కార్యకర్తలకు ప్రేరణగా నిలిచే బాపూజీకి ఈ పర్యటనలో తగిన ప్రాధాన్యమివ్వలేదు. ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరిన ట్రంప్ దంపతులు అక్కడ సందర్శకుల పుస్తకంలో వారు రాసిన కామెంటే ఈ చర్చకు కేంద్రంగా మారింది.

ఇదివరకు భారత్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షులు.. చరిత్రలో భారత్ ఘనతను గుర్తించి అందుకు అనుగుణంగా మెలిగేవారు. ఉదాహరణకు బరాక్ ఒబామా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు అక్కడి విజిటర్స్ బుక్‌లో గాంధీజీ గొప్పతనాన్ని క్లుప్తంగా రాశారు. ఒబామా సతీమణి మిచెల్లి కూడా మహాత్మా గాంధీ ఔన్నత్యాన్ని గురించి రాసుకొచ్చారు. కానీ, ఇప్పుడు పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దంపతులు మాత్రం గాంధీకి సముచిత ప్రాధాన్యతను ఇవ్వలేదు. ట్రంప్ తన ప్రసంగంలో బాలీవుడ్ సినిమాల గురించి, క్రికెటర్లు సచిన్, విరాట్ కోహ్లీల గురించి మాట్లాడారు. కానీ, ప్రపంచం ఆరాధించే మహాత్మాగాంధీ గురించి అణుమాత్రమైన ప్రస్తావించలేదు. సబర్మతీ ఆశ్రమంలో చరఖాను పరిశీలించారు. దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. కానీ, మహాత్ముడు ప్రవచించిన ఏ అంశం గురించీ మాట్లాడలేదు. అంతెందుకు సబర్మతీ విజిటర్స్ బుక్‌లో మహాత్మాగాంధీ పేరును ప్రస్తావించకుండా మోడీ గురించి రాసుకొచ్చారు. ఇంతటి గొప్ప సందర్శనకు కారకుడైన మిత్రుడు మోడీకి కృతజ్ఞతలు అని రాశారు. అమెరికాకు చెందిన మార్టిన్ లూథర్ కింగ్ లాంటి దిగ్గజనేతలకు ఆదర్శప్రాయుడిగా ఉన్న మహాత్మాగాంధీని డొనాల్డ్ ట్రంప్ స్మరించలేదు. భారత ఆత్మలో మిళితమై ఉన్న గాంధీని విస్మరించడమంటే.. భారత ప్రజల సగర్వ చరిత్రను లెక్కచేయనట్టేనన్న విమర్శలు వస్తున్నాయి. కేవలం వర్తమాన రాజకీయాలు, అంశాలకే పరిమితమైన ట్రంప్.. భారత ఘనమైన చరిత్రను స్పృషించనే లేదు. కేవలం మోడీ స్తుతికే పరిమితమైపోయారు.

కాగా, 2010లో మనదేశ పర్యటనకు వచ్చిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు రాసిన వ్యాఖ్యలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. గాంధీ జీవితానికి సంబంధించిన వాటిని చూసే అదృష్టం కలిగినందుకు గర్వంగా ఉన్నదని, ఇది తన జీవితంలో ఒక ప్రేరణగా ఉంటుందని వివరించారు. గాంధీ కేవలం భారత్‌కే కాదు, యావత్ ప్రపంచానికే నేత అని కితాబిచ్చారు. కాగా, ఆయన సతీమణి మిచెల్లి ఒబామా కూడా గాంధీ జీవితాన్ని, అతని బోధనలను ప్రపంచదేశాల పిల్లలందరికీ వివరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

Read Also..

21వేల కోట్ల డిఫెన్స్ డీల్



Next Story

Most Viewed