నందిగ్రామ్.. మమతా మయం

by  |
నందిగ్రామ్.. మమతా మయం
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అన్ని అసెంబ్లీ స్థానాల ఎన్నికలు ఒక ఎత్తు, నందిగ్రామ్ ఎన్నికలు మరో ఎత్తు. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రంలో పట్టుపెంచుకోవడంపై ఫోకస్ పెట్టిన బీజేపీకి మధ్య ఈ స్థానంలో పోలింగ్ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానంలో సీఎం మమతా బెనర్జీ, రాష్ట్ర మాజీ మంత్రి సువేందు అధికారి బీజేపీ నుంచి పోటీ చేశారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి ఆధిక్యం వీరిద్దరి మధ్య దోబూచులాడింది. తొలి రౌండ్‌లలో సువేందు అధికారివైపు ఆధిక్యం మొగ్గింది. ఆరేడు రౌండ్‌ల వరకు అధికారే గెలిచే అవకాశమున్నట్టు ట్రెండ్స్ కనిపించాయి. కానీ, మధ్యాహ్నం కల్లా దీదీ పుంజుకున్నారు. ఆధిక్యం ఆమె వైపునకు చేరింది. ఇప్పుడు(మధ్యాహ్నం 1.30 గంటల వరకు) నందిగ్రామ్‌లో మమతా బెనర్జీనే దాదాపు 2,700 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో ఇప్పటికే టీఎంసీ శ్రేణులు విజయోత్సవాల్లో మునిగిపోయారు.

దీదీకి శరద్ పవార్ కంగ్రాట్స్

ట్రెండ్స్ అని మమతా బెనర్జీవైపే లీడ్ చూపెడుతుండటంతో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ మమతా బెనర్జీ ముందస్తుగానే కంగ్రాట్స్ చెప్పారు. అద్భుత విజయానికి మమతా బెనర్జీకి కంగ్రాట్స్ అని ట్వీట్ చేశారు. ప్రజల సంక్షేమానికి, మహమ్మారిని కలిసికట్టుగా ఎదుర్కోవడానికి కలిసి పోరాడుదామని పేర్కొన్నారు.

టీఎంసీకి నందిగ్రామ్‌కు లింకేంటి?

పశ్చిమ బెంగాల్ పాలిటిక్స్‌లో నందిగ్రామ్‌కు ప్రత్యేకత ఉన్నది. రాష్ట్రంలో 2007లో అప్పటి వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ భీకర ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో సువేందు అధికారి, మమతా బెనర్జీకి లెప్టినెంట్ పాత్ర పోషించారు. ఒకానొక దశలో ఆ ఉద్యమ విజయం వెనుక తన పాత్రే ఉన్నదని అధికారి గర్వంగా ప్రకటించుకున్నారు. ఈ ఉద్యమం తర్వాతే టీఎంసీ తన ఉనికిని బలంగా చాటుకుంది. 2011లో అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే దీదీపై బలమైన అభ్యర్థిని దించి నైతికంగా బలహీనపరచాలని బీజేపీ ఎత్తువేసింది. అందులో భాగంగానే దీదీకి విశ్వాసపాత్రుడిగా ఉన్న సువేందు అధికారిని ఇక్కడి నుంచి బరిలోకి దించింది.


Next Story

Most Viewed