కరోనా నుంచి రికవరీ అంత సులభం కాదు!

by  |
కరోనా నుంచి రికవరీ అంత సులభం కాదు!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మరింతగా క్షీణిస్తుందని, అదే సమయంలో అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం ఈ వైరస్ రికవరీపై ప్రభావం ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) హెచ్చరించింది. ఐఎమ్ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా యూరోపియన్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన ఈవెంట్‌లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2020లో అంతర్జాతీయంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయని, వృద్ధి రేటు 3 శాతం కంటే తక్కువకు పడిపోయే అంచనాలున్నట్లు, ప్రస్తుత పరిణామాలను గమనిస్తే మరింతగా దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పరిష్కారం లేకపోవడమే కారణం…

గత కొన్ని వారాలుగా ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం వల్ల కరోనా రికవరీపై ఎక్కువ ప్రభావం పడుతుందని చెప్పారు. అత్యవసరంగా వైద్య రంగానికి పరిష్కారం లేనందున ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం తప్పదని తెలిపారు. 1930లో సంభవించిన మహా మందగమనం అనంతరం మళ్లీ ఇదే అతిపెద్ద సంక్షోభమని, దీన్నుంచి కొంత కోలుకుని 2021లో ఆర్థిక వ్యవస్థ అధిగమిస్తూ కొంత పుంజుకునే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

అమెరికా ఆర్థికవ్యవస్థ..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా సైతం కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్టు, ఏప్రిల్ నెలలో నిరుద్యోగిత రేటు ఏకంగా 14.7 శాతానికి పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పట్లో మెరుగుపడే పరిస్థితి లేనందున మే నెలలో ఇది 20 శాతానికి పెరిగే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. కరోనాకు ముందు కొంత సానుకూలంగా ఉన్న అమెరికా-చైనా సంబంధాలు కరోనా విజృంభణతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది.

2.5 ట్రిలియన్ డాలర్లు అవసరం…

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ప్రపంచ వాణిజ్యం ఎంతో కీలకమని ఐఎమ్ఎఫ్ చెప్పారు. ప్రపంచ వాణిజ్యం కుప్పకూలితే ఖర్చులు పెరుగుతాయని, ఆదాయం భారీగా క్షీణిస్తుందని, ఆ పరిణామాలు గనక ఏర్పడితే భద్రత తగ్గిన ప్రపంచంగా పరిస్థితులు మారుతాయని ఐఎమ్ఎఫ్ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ కరోనా ప్రభావంతో 103 దేశాలు ఆర్థిక సాయాన్ని కోరాయని, వాటిలో యాభై దేశాలకు సాయం అందించినట్టు పేర్కొన్నారు. అమెరికా లాంటి సంపన్న దేశాల్లో మరణాలు ఎక్కువ ఉన్నప్పటికీ..పేద దేశాల్లో మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ..అన్ని దేశాల్లోని ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా దెబ్బ తింటున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు, ఆయా దేశాలకు ఆరోగ్య, ఆర్థిక నిర్వహణ కోసం సుమారు 2.5 ట్రిలియన్ డాలర్లు అవసరమవుతాయని ఐఎమ్ఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ చెప్పారు.

Next Story

Most Viewed