ఇంటర్నెట్ సర్వీస్ కావాలంటే.. ఏడాది తప్పనిసరి : ఇంటర్నెట్ ప్రోవైడర్లు

by  |
ఇంటర్నెట్ సర్వీస్ కావాలంటే.. ఏడాది తప్పనిసరి : ఇంటర్నెట్  ప్రోవైడర్లు
X

దిశ వెబ్ డెస్క్
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఎమ్ ఎన్ సీ కంపెనీలు, ఐటీ సంస్థలు, మరెన్నో చిన్న కంపెనీలు అన్నీ షట్ డౌన్ ను స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి. తమ ఉద్యోగులందరినీ ఇంటి నుంచే పనులు (వర్క్ ఫ్రమ్ హోమ్) చేయడానికి అనుమతులిచ్చాయి. ల్యాప్ టాప్ లు, పీసీలు రెంట్ కు తీసుకుని తమ ఉద్యోగులకు అందించాయి. అయితే కొన్ని చిన్న కంపెనీలు మాత్రం ఇంటర్నెట్ సర్వీస్ ను తామే పెట్టుకోవాలని సూచించాయి. దాంతో ఉద్యోగులు కూడా చేసేది ఏం లేక.. అందుకు సరే అన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఇంటర్నెట్ సేవల కోసం బ్రాడ్ బ్యాండ్ కంపెనీలను సంప్రదిస్తే.. ఏడాది కనెక్షన్ తీసుకుంటేనే సర్వీస్ ఇస్తామని అంటున్నాయి.

సీన్ 1 : వారం రోజుల లాక్ డౌన్ సమయంలో …

జీవన్ ఓ చిన్న కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు . ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత .. రాష్ర్ట ప్రభుత్వం వారం రోజుల పాటు (మార్చి 31) వరకు లాక్ డౌన్ ప్రకటించాయి. ఎక్కడి సేవలు అక్కడ నిలిచిపోయాయి. దాంతో జీవన్ పని చేస్తున్న కంపెనీ వాళ్లు .. వారం రోజుల పాటు ఇంటి నుంచే పని చేయాలని అందుకు ల్యాప్ టాప్ అమర్చుకోమని చెప్పాయి. చార్జీలు కూడా విపరీతంగా పెంచాయి. ఇంటర్నెట్ కూడా పెట్టుకోవల్సిందిగా చెప్పాయి. దాంతో జీవన్ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఫోన్ (ఆక్ట్ ఫైబర్, హాత్ వే, లోకల్ నెట్ వర్క్స్) చేశాడు. సర్వీస్ అందిస్తాం కానీ మూడు నెలలు తప్పనిసరిగా ఇంటర్నెట్ పెట్టుకోవాలని సూచించాయి. అంతేకాదు ఇన్స్టాలేషన్ 1000 రూపాయలు అవుతాయని చెప్పడంతో.. జీవన్ తన మొబైల్ ఫోన్ తోనే మూడు రోజులు నెట్టుకొచ్చాడు. ఇంతలో ప్రధాని మోదీ 21 రోజుల పాటు దేశమంతా లాక్ డౌన్ అంటూ ప్రకటించాడు.

సీన్ 2 : 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన మొదటి రోజు

జీవన్ మళ్లీ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఫోన్ చేశాడు. ఈ సారి వాళ్లు.. విధిగా 6 నెలలు ఇంటర్నెట్ పెట్టుకుంటేనే సర్వీస్ ఇస్తామని లేదంటే లేదని తెగేసి చెప్పాయి. దాంతో జీవన్ కంగుతిన్నాడు. వచ్చే 20 వేల జీతానికి … ఇంటర్నెట్ ఆరు నెలలు పెట్టుకుంటే.. ఎనిమిది వేలు కావాలి. ఇన్స్టాలేషన్ కు మరో 1000 అదనం. ఫోన్ బిల్లు. జీవన్ కు ఇంటర్నెట్ అవసరమున్నది నెల రోజులు మాత్రమే. అందుకు 5 నెలలు అదనం ఎందుకు అని ఆలోచించాడు. ఆఫీసు కు ఫోన్ చేసి అంతా వివరించాడు.

సీన్ 3 : 21 రోజుల లాక్ డౌన్ రెండో రోజు

జీవన్ కు ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. ఇంటర్నెట్ కు సగం పేమేంట్ తాము భరిస్తామని., మిగతా సగం జీవన్ ను భరించాల్సిందిగా చెప్పాయి. జీవన్ మరోసారి ఇంటర్నెట్ ప్రొవైడర్లకు ఫోన్ చేశాడు. ఈ సారి వాల్లు ఏడాది ఇంటర్నెట్ సేవలు తీసుకుంటేనే సర్వీస్ అందిస్తామని,, బయట లాక్ డౌన్ ఉందని, తాము రిస్క్ చేసి సేవలు అందిస్తున్నామని చెప్పారు. జీవన్ కు ఏం చేయాలో పాలుపోలేదు.

ఇది జీవన్ ఒక్కడి సమస్య కాదు. వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న చాలా మంది సమస్య. దేశానికి, రాష్ట్రానికి విపత్తు వచ్చిన సమయాల్లో ఉదార భావంతో ,, సేవాభావంతో సాటి మనిషికి సాయపడాల్సింది పోయి.. అందరూ తమ ఇష్టారీతిగా.. వచ్చినకాడికి డబ్బులు దండుకుందామనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్న కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిరాణా షాపుల్లో పాల ప్యాకెట్లు కూడా ఎక్కువ ధరకే విక్రయిస్తున్నారు . ఇక ఇంటర్నెట్ సర్వీస్
ప్రొవైడర్ల సంగతి చూస్తే ఇలా ఉంది.. వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఇంటి నుంచే పని చేస్తున్నారు. వారికి సేవలు అందించాల్సింది పోయి.. రేట్లు పెంచి, తప్పనిసరిగా సంవత్సరం పాటు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనడం ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలి. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉంది. ఇలాంటి సమయంలో దేశ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సింది పోయి.. వచ్చిందే అవకాశమని డబ్బులు దండుకోవాలనుకోవడం ఏమిటో?

Tags: INTERNET, WORK FROM HOME, SERVICE, NET, LOCK DOWN , IT, EMPLOYEES

Next Story