జగన్ క్షమాపణలు చెప్తే.. అయ్యన్న వ్యాఖ్యలపై స్పందిస్తాం

by  |
SomiReddy
X

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో ఉన్నామా.. ఆఫ్ఘన్‌లో ఉన్నామా.? అని సందేహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అని తెలిపేందుకే ఈ ఘటనే ఒక నిదర్శనమని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇంటిపై దాడి.. వైసీపీ బరితెగింపునకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యల్లో అయ్యన్న వ్యాఖ్యలు 1% కూడా లేవన్నారు.

వైసీపీ నేతల భాషపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చాత్తాపం వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ క్షమాపణలు చెప్పిన తర్వాతే మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై ఆలోచిస్తామని సోమిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయన్నది స్పష్టంగా తెలుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీవీఐపీలు తిరిగే ప్రాంతంలోనే ఇలాంటి దౌర్జన్యమా.? అంటూ నిలదీశారు. ప్రజాస్వామ్యబద్దంగా వెళ్తే గృహనిర్బంధాలు చేస్తున్న ఈ పోలీసులు కర్రలు, కత్తులతో వచ్చేవారికి స్వాగతం పలుకుతుండటం సిగ్గుచేటని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed