మంత్రి పర్యటన.. ఆ ఘటనతో భారీ బందోబస్తు…

by  |
మంత్రి పర్యటన.. ఆ ఘటనతో భారీ బందోబస్తు…
X

దిశ, కామారెడ్డి : ఈ నెల 5న గాంధారి మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తున్న సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కాన్వాయిని బీజేవైఎం నాయకులు అడ్డుకున్న ఘటనతో జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించిన గాంధారి ఎస్సై శంకర్ ను ఎఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా గురువారం మాచారెడ్డి మండలం పాల్వంచ మర్రి, చుక్కాపూర్ గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 32 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసు శాఖ మంత్రి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.

కామారెడ్డి నుంచి మాచారెడ్డి చౌరస్తా వరకు అడుగడుగునా పోలీసులను మోహరించారు. మంత్రి కాన్వాయి వాహనం తప్ప ఇతర వాహనాలను అనుమతించలేదు. వచ్చి పోయే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ మంత్రి కాన్వాయికి అడ్డురాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంత్రి కాన్వాయి కంటే ముందు ఓ పోలీసు వాహనం వెళ్తూ బందోబస్తును పర్యవేక్షించింది. ప్రారంభోత్సవం, శంకుస్థాపన సమయంలో మంత్రి చుట్టూ రోప్ పట్టుకుని పోలీసులు బందోబస్తు చేపట్టారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మాచారెడ్డి పర్యటన సందర్బంగా బీజేవైఎం నాయకులు మంత్రిని అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ పహారాలో మంత్రి పర్యటన కొనసాగింది.

Next Story

Most Viewed