కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న భారత హాకీ జట్లు

by  |
Hokey1
X

దిశ, స్పోర్ట్స్: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022 కు భారత మహిళ, పురుష జట్లను పంపకూడదని హాకీ ఇండియా నిర్ణయించింది. వచ్చే ఏడాది జులై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు బర్మింహామ్‌లో కామన్వెల్త్ గేమ్స్ జరుగనున్నాయి. అయితే గేమ్స్‌లో పాల్గొనే ప్రతీ అథ్లెట్ ఇంగ్లాండ్‌లో 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది క్రీడాకారులకు ఇబ్బందిగా ఉంటుందని హాకీ ఇండియా భావిస్తున్నది. మరోవైపు 2022 సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు చైనాలో ఏసియన్ గేమ్స్ జరుగనున్నాయి. 2024 పారీస్ ఒలింపిక్స్‌కు ఏసియన్ గేమ్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా ఉన్నది. ఈ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకునే కామన్వెల్త్ గేమ్స్ బదులు ఏసియన్ గేమ్స్‌కు ఇరు జట్లను పంపాలని నిర్ణయించినట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు జ్ఞానేంద్రో ఒక ప్రకటనలో తెలిపారు. ‘కామన్వెల్త్ గేమ్స్‌కు ఏసియన్ గేమ్స్‌కు మధ్య కేవలం 32 రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నది. ఎవరైనా ప్లేయర్ కామన్వెల్త్ గేమ్స్‌లో కోవిడ్ బారిన పడితే ఏసియన్ గేమ్స్‌కు దూరమవుతాడు. ఇది ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్‌పై ప్రభావం చూపే అవకాశం ఉన్నది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని జ్ఞానేంద్రో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed