హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

by  |
హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు
X

దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టులో మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను హైకోర్టులో సవాలు చేయడం, అక్కడ కొర్రీలు పడడం చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రాజధాని అమరావతిలో ఆర్5 జోన్ ను ప్రకటిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ 355ను రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. దీనిని నాలుగు వారాల పాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

సీఆర్డీయే సెక్షన్ 41 ప్రకారం… రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయాలనుకుంటే… స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలను సేకరించాలని అమరావతి రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనను కూడా విన్న హైకోర్టు… ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.

కాగా, పేదలకు పట్టాల పంపిణీలో భాగంగా ఆర్5 జోన్ కింద రాజధానిలోని 29 గ్రామాల ప్రజలకే కాకుండా గుంటూరు, విజయవాడతో పాటు మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల వారికి కూడా ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు 1300 ఎకరాలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చట్టపరమైన ప్రక్రియ, నిబంధనలు పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని… సీఆర్డీయే సూత్రాలకు వ్యతిరేకంగా ప్రక్రియను చేపట్టిందని పిటిషన్ వేశారు.



Next Story