మసీదుకి వెళ్లిన వారంతా వైద్యం చేయించుకోండి: ఆళ్ల నాని

by  |
మసీదుకి వెళ్లిన వారంతా వైద్యం చేయించుకోండి: ఆళ్ల నాని
X

ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్ మసీదుకి వెళ్లివచ్చిన వారి వల్లే ఒక్కసారిగా కరోనా కేసులు పెరిగిపోయాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అమరావతి రీజియన్‌లోని తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, మర్కజ్ మసీదుకి వెళ్లి వచ్చిన వారంతా స్వచ్ఛందంగా కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కట్టడి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.

నెల్లూరు జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైనా దానిని నెగిటివ్‌ మార్చిన ఘనత జిల్లా యంత్రాంగానిదేనని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌కు వివిధ దేశాల నుంచి 30,995 మంది వచ్చారని ఆయన తెలిపారు, వారిలో 30, 693 మందిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామని ఆయన చెప్పారు. కరోనాను ఎదుర్కొనేందుకు 30 మంది ఐపీఎస్‌ అధికారులను ప్రత్యేకంగా నియమించామని ఆయన చెప్పారు.

కరోనా నిర్ధారణ ల్యాబ్‌ల సంఖ్య పెంచడంతో పాటు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ అంటే ప్రజలను ఇళ్లలో ఉంచి తాళాలు వేయడం మాత్రమే కాదని, వారికవసరమైన నిత్యావసరాలను అందజేయడం కూడా ప్రభుత్వ బాధ్యతేనని తెలిపారు. నిత్యావసర సరుకుల ధరలు పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించామని, దుకాణాల ముందు ధరల పట్టిక ఏర్పాటు చేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Tags: alla nani, corona, tadepalli, ysrcp



Next Story

Most Viewed