అందరూ వాడుకొని వదిలేసిన్రు.. స్పందించకపోతే నిరసనలే!

by  |
Aids
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా విపత్కర పరిస్థితుల్లో క్రీయాశీలకంగా పనిచేసిన హెల్త్ కేర్ వర్కర్లను సర్కార్ పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు సేవలు వినియోగించుకోని, సమస్యలు వచ్చినప్పుడు మాత్రం స్పందించడం లేదని వైద్యారోగ్యశాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌ల ప్రాబ్లమ్స్‌పై ప్రభుత్వంతో పాటు వైద్యారోగ్యశాఖలోని హెచ్ఓడీలు సైతం కన్నెత్తి చూడటం లేదని ఆ శాఖలోని ఉద్యోగులు మండిపడుతున్నారు.

క్షేత్రస్థాయిలో అన్ని సేవలు చేయించుకున్రు..

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు వేగంగా వైద్యసేవలు అందించాలని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (నాకో), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోని (TSACS) వివిధ రకాల ఉద్యోగులు నిర్వీరామంగా కృషి చేశారు. ఈ విభాగంలోని వైద్యులు, కౌన్సిలర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, టెక్నికల్ ఆఫీసర్లు, డేటా మేనేజర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, కేర్ కోఆర్డినేటర్లు, డాప్సియు సిబ్బంది, బీటీఎస్ స్టాఫ్ తదితరులు కరోనా నియంత్రణ కొరకు అద్భతంగా పనిచేశారు. రాష్ర్ట వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి టీచింగ్ హాస్పిటళ్ల వరకు సుమారు 850 మంది కరోనా కట్టడి కొరకు ప్రజలకు సేవలు అందించారు. ఒక వైపు ఎయిడ్స్ నియంత్రణ కోసం కృషి చేస్తూనే, మరోవైపు కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు తమ వంతు బాధ్యతను పోషించారు.

తెలంగాణలో కరోనా ప్రవేశించిన తొలి నాళ్లలో పబ్లిక్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఉద్యోగులతో కలసి వీరూ కరోనా సేవల్లో భాగస్వామ్యమయ్యారు. అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించేందుకు ఇతర విభాగాల ఉద్యోగులు భయాందోళనకు గురైనా, వీరు మాత్రం వెనకడుగు వేయలేదు. పైగా ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగులు అందరి కంటే ముందు కరోనా సేవల్లో పాల్గొనడం గమనార్హం. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా ప్రజలను కాపాడేందుకు వెనకడుగు వేయలేదు. కానీ ఇటీవల స్టేట్ గవర్నమెంట్ వైద్యారోగ్యశాఖలోని అన్ని విభాగాల ఉద్యోగులకు 30 శాతం కరోనా ఇన్సెంటీవ్‌లు ఇచ్చి, ఈ సెక్టార్‌కు మాత్రం ఇవ్వలేదు. దీంతో ఆ విభాగంలోని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సీఎంకు విన్నపించినా…

తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలోని వివిధ కేడర్లలోని ఉద్యోగులు 18 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ నుంచి సరైన సపోర్టు లభించడం లేదని ఆ శాఖలోని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. స్వరాష్ర్టం ఏర్పడిన తర్వాత కూడా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బెన్ ఫిట్‌లు లేవని చెబుతున్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ను, హెల్త్ సెక్రటరీని ప్రత్యేకంగా కలసి తమ సమస్యలు విన్నపించుకున్నా స్పందించడం లేదన్నారు. ఢిల్లీలో 20 శాతం, పంజాబ్‌లో 9 శాతం, మధ్యప్రదేశ్‌లో 3 శాతం చొప్పున నాకో నుంచి వచ్చే శాలరీలకు అదనంగా ఆయా స్టేట్ గవర్నర్ మెంట్‌లు ఇస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వరకు సహాయం చేయాలని గతంలో ప్రభుత్వాన్ని కోరినట్లు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉద్యోగులు పేర్కొన్నారు. ఆ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎం హెచ్ఓడీలను కొరగా, వారంతా తప్పుడు నివేదికలు సమర్పించినట్లు ఎంప్లాయిస్ ఆరోపిస్తున్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏపీడీ అన్నప్రసన్న వివక్ష చూపడంతోనే తమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెడికల్ ఆఫీసర్లకు చేసి..

ఎయిడ్స్ కంట్రోల్ బోర్డులోని కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా కాలం నుండి వేతనాల పెంపు కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ గత ఆర్థిక సంవత్సరంలో నాకో ఆర్డ్ కేంద్రాల్లో పనిచేసే సీనియర్ మెడికల్ ఆఫీసర్లకు మాత్రమే పే రివిజన్ చేసి, ఇతర కాంట్రాక్టు ఉద్యోగులపై వివక్షను చూపడం అన్యాయమని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

28 నుంచి జిల్లాల వారీగా నిరసనలు

హెల్త్ డిపార్ట్‌మెంట్‌లోని ఇతర విభాగాల ఉద్యోగులకు ఇచ్చినట్లే తమకూ కరోనా ఇన్సెంటీవ్‌లు ఇవ్వాలని ఆల్ ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ వెల్పేర్ అసోసియేషన్ కోరుతున్నది. లేదంటే ఈనెల 28వ తేది నుంచి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేగాక ఈఎస్ఐ, పీఎఫ్‌తో పాటు కొవిడ్‌తో చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియాను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

ఎయిడ్స్ కంట్రోల్‌లో పనిచేసే ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

Sujith

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పరిధిలో పనిచేసే ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. ఇతర విభాగాల ఉద్యోగులకు ఇచ్చినట్లే తమకు కొవిడ్ ఇన్సెంటీవ్‌లు ఇవ్వాలి. కొవిడ్‌తో చనిపోయిన తమ విభాగాపు ఎంప్లాయిలకు ఎక్స్ గ్రేషియను వర్తింపజేయాలి. తమ సమస్యలు పరిష్కరించపోతే రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు చేపడతాం.
-సుజిత్, ఆల్ ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

Next Story

Most Viewed