మోగిన బడి గంట.. సగం మందే హాజరు

by  |
మోగిన బడి గంట.. సగం మందే హాజరు
X

దిశ ప్రతినిధి, మెదక్: పదకొండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత పాఠశాలల్లో బడి గంట మోగింది. సోమవారం రోజున రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ విద్యార్థులకు పాఠశాలకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో విద్యార్ధులకు ప్రభుత్వం మాస్కులు అందించగా .. ప్రయివేటులో విద్యార్ధులే సొంత డబ్బులు పెట్టుకొని మాస్కులు పెట్టుకొని వచ్చారు. పలు పాఠశాలల్లో కొంత నీటి సమస్య, ఇతర సమస్యలు తలెత్తినప్పటికీ తొలి రోజు ప్రశాంతంగా పాఠశాలలు ముగియడంతో జిల్లా విద్యాశాఖాధికారులు, ప్రజాప్రతినిధులు, ఉ పాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

సగం మందే హాజరు..

ఉమ్మడి మెదక్ జిల్లాలో 9, 10 తరగతుల కోసం 1,104 పాఠశాలలు ప్రారంభం కాగా తొలి రోజు 87 వేల మందికి గాను 45 వేల వరకు హాజరైనట్టు సమాచారం. మొత్తానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 శాతం హజరు నమోదైనట్టు విద్యా శాఖ అధికారులు తెలిపారు. అందులో పదోతరగతి విద్యార్థులే అధికంగా హాజరయ్యారు. తొమ్మిదో తరగతి విద్యార్థులు స్వల్పంగా హాజరైన చోట్ల కొన్ని స్కూలు యాజమాన్యాలు తిరిగి ఇంటికి పంపించినట్టు సమాచారం. కాగా విద్యార్ధులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వైద్యం అందించేందుకు ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాఠశాలల్లోనే విధులు నిర్వహించారు.

మాస్క్‌తోనే హాజరు

పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థి మాస్క్ పెట్టుకొనే హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలకు వచ్చిన ప్రతి విద్యార్థిని ఉపాధ్యాయులు మొదటగా టెంపరేచర్ చెక్ చేసి, విద్యార్ధుల చేతులకు శానిటైజ్ చేసి లోనికి పంపారు. తరగతి గదిలో భౌతిక దూరం పాటించేలా బెంచికీ ఒక్కరూ చొప్పున కూర్చోబెట్టి పాఠాలు బోధించారు. మూత్ర విసర్జన సమయం, మధ్యాహ్న భోజన సమయంలో భౌతిక దూరం పాటిస్తూ మాస్కుతోనే కనిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వమే మాస్కులు అందివ్వగా … మరికొన్ని పాఠశాలల్లో దాతలు, ప్రజాప్రతినిధులు మాస్కులు పంపిణీ చేశారు. కాగా ప్రయివేటులో మాత్రం విద్యార్ధులే హాండ్ శానిటైజర్, మాస్కులు కొనుగోలు చేశారు.

అప్యాయ పలకరింపులు

సుమారు పదకొండు నెలల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు కలుసుకోవడంతో భౌతిక దూరం పాటిస్తూనే అప్యాయంగా పలకరించుకున్నారు. లాక్‌డౌన్ కాలంలో ఫోన్‌లో సంభాషించుకున్నప్పటికీ ప్రత్యక్షంగా స్కూల్లో కలుసుకోవడంతో వారి అప్యాయతకు అవధుల్లేకుండా పోయింది. తొలి రోజంతా వారి స్నేహితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, ఉపాధ్యాయులు విద్యార్ధుల యోగక్షేమాలు, విద్యార్ధులు ఉపాధ్యాయుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడానికే సమయం సరిపోయింది. తొలి రోజు కావడంతో పాఠాలేమి ఎక్కువగా చెప్పలేదు. రేపటి నుంచి పూర్తిగా బోధిస్తామని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

తొలగని కరోనా భయం

తొలి రోజు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత భయం భయంగా ఉన్నారు. తొలి రోజు ఎలా ఉండబోతుందోనన్న అనుమానం, కరోనా పట్ల ఇంకా భయం తొలగకపోవడంతో తల్లిదండ్రులు వారి విద్యార్ధులను బడికి పంపించలేదు. మరికొందరు విద్యార్ధులే బడికి పోవడానికి ఇష్టపడనట్టుగా తెలుస్తోంది. కొందరు తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి మరీ పాఠశాల ఆవరణాలను పరిశీలించి వెళ్లారు. మరికొందరు తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందజేశారు. ఏదేమైనా రేపటి నుంచి క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

హాజరు అంతంతే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు ప్రభుత్వ పాఠశాలల్లో దిశ సర్వే నిర్వహించింది. సిద్దిపేట జిల్లా నుంచి సిద్దిపేట పట్టణంలోని మల్టీపర్పస్ పాఠశాలలో 9, 10 తరగతుల్లో 190 మంది విద్యార్థులకు గాను 70 మంది హజరయ్యారు. పాఠశాలలో ఒక్క సెక్షన్‌కు 20 మంది చొప్పున విభజించి కూర్చోబెట్టారు. సంగారెడ్డి జిల్లాలో పటాన్ చెరు పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించగా అందులో 143 మంది విద్యార్ధులకు గాను 69 మంది మాత్రమే హజరయ్యారు.



Next Story

Most Viewed