గ్రేటర్లో మళ్లీ గుడుంబా..??

by  |
గ్రేటర్లో మళ్లీ గుడుంబా..??
X

దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో గుడుంబా అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. గుడుంబాను అరికట్టామని ప్రభుత్వం పలుమార్లు చెప్పినప్పటికీ, ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. గుడుంబా తయారీ, సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎం కేసీఆర్ ఆ సమావేశంలో పోలీస్ శాఖను హెచ్చరించారు. లాక్ డౌన్ నేపథ్యంలో లిక్కర్ వ్యాపారం పూర్తి స్థాయిలో బంద్ కావడంతో మద్యం ప్రియులు గుడుంబాను ఆశ్రయించారు. నిబంధనలను సడలించిన అనంతరం బార్లు, వైన్స్ ఓపెన్ అయ్యాయి. లాక్ డౌన్ సమయంలో గుడుంబా విక్రేతలపై కేసులు కూడా నమోదయ్యాయి. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుడుంబా ఏరులై పారే అవకాశంపై ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రధానంగా కేంద్రీకరించారు.

ప్రత్యామ్నాయ ఉపాథి..

హైదరాబాద్ నగరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా గుడుంబా తయారీ దారులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ చర్యల్లో భాగంగానే ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ యూనిట్లను అందజేశారు. కులవృత్తికి అనుగుణమైన యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇలా హైదరాబాద్ నగరంలో సుమారు 800కు పైగా రుణాలను అందజేశారు. వీటిలో అత్యధికంగా ఆటోలు, టెంట్ హౌస్ లు, కిరాణం తదితర యూనిట్లు ఉన్నాయి. కరోనా ప్రభావంతో యూనిట్లు సక్రమంగా నడవక కొందరు తిరిగి గుడుంబా తయారీ బాట పట్టినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో..

జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో గుడుంబా తయారీ, విక్రయదారులపై ఎక్సైజ్ అధికారులు ప్రధాన దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో నగరంలో ఎక్కడా కూడా గుడుంబా తయారీ లేదని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ, నగరానికి సమీప ప్రాంతాల నుంచి గుడుంబా సరఫరా అవుతున్నట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ఏ ఎన్నికలు అయినా.. అందులో మద్యం, లిక్కర్ పాత్ర ఎంత ఉంటుందో మనకు తెలియంది కాదు. ఈ పరిస్థితుల్లో సమీప జిల్లాల నుంచి నగరానికి తరలుతున్న సారా సరఫరా చేస్తున్న వారిపై అధికారులు ఓ కన్నేశారు. విక్రయదారులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు.

నగరంలోని దూల్‌పేటతో పాటు మలక్‌పేట సింగరేణి కాలనీ కూడా ప్రస్తుతం గుడుంబాకు అడ్డగా మారుతోంది. ఇక్కడకు నల్లగొండ, మిర్యాలగూడెం, దేవరకొండ ప్రాంతాల నుంచి సింగరేణి కాలనీకి గుడుంబా సరఫరా అవుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ సరఫరా ఇలాగే కొనసాగితే, కచ్చితంగా గ్రేటర్ ఎన్నికల్లో గుడుంబా ఏరులై పారే అవకాశం లేకపోలేదు. అంతే కాకుండా, నగరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మేడ్చల్ జిల్లా కీసర, మెదక్ జిల్లా జిన్నారం, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి నగరానికి గుడుంబా చేరే అవకాశాలు ఉన్నాయి. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో గుడుంబా సరఫరా కాకుండా, గుడుంబా సరఫరాను అరికట్టడానికి ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed