రంగం సిద్ధం.. నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ

by  |
Graduate MLC Elections
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 14న మండలి పోలింగ్​ ఉండగా.. మంగళవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ పత్రాలను జారీ చేస్తున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వరంగల్​–ఖమ్మం–నల్గొండ, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సారి 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్‌ బారిన పడిన వారంతా ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అంతేగాకుండా అధికారులే ఓటర్ల వద్దకు వెళ్లి ఓటును స్వీకరించనున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల పరిధిలో వృద్ధులు, దివ్యాంగులు, కొవిడ్‌ బారిన పడిన పట్టభద్రులంతా కలిసి 459 మందిగా గుర్తించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు వినియోగించుకునే వారి జాబితాను సిద్ధం చేశారు. 9న దివ్యాంగుల నుంచి , 10న 80ఏండ్లు పైబడిన వారు, 11, 12న కొవిడ్‌ బారినపడిన వారి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును స్వీకరిస్తున్నారు. 13-డిలో దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు ఉంటుంది. వారు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి వద్దకే వెళ్లి పోలింగ్‌ అధికారి సమక్షంలో ఓటును స్వీకరించి భద్రపర్చనున్నారు. అధికారులు ఫాం 13-ఎ, 13-డీ, 13-సీ పత్రాలను ఆయా ఓటర్‌ ఇంటికి వెళ్లి వారికి అందజేస్తారు. ఓటు వేసే ప్రక్రియను అత్యంత సీక్రెట్‌గా నిర్వహించడంతో పాటు మొత్తం వీడియో రికార్డింగ్‌ చేస్తారు. తొలిసారిగా దివ్యాంగులు, వృద్ధులు, కొవిడ్‌ బారిన పడిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ విధానంలో మండలి ఎన్నికల్లో ఓటింగ్‌కు అవకాశం కల్పించారు. వరంగల్ పరిధిలో కూడా దాదాపు 530 మంది కోవిడ్​బాధితులుగా తేల్చారు. వీరికి కూడా ప్రత్యేక పర్యవేక్షణలో పోస్టల్ బ్యాలెట్‌ను అందించి, ఓటేసిన తర్వాత మళ్లీ తీసుకోనున్నారు. వీరితో పాటుగా ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది నేరుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను తీసుకుని ఓటు వేసి కార్యాలయాల్లో అప్పగించాల్సి ఉంటోంది.

Next Story

Most Viewed