జగన్‌ ప్రభత్వంపై విరుచుకుపడ్డ ఏపీ జేఏసీ..

by  |
జగన్‌ ప్రభత్వంపై విరుచుకుపడ్డ ఏపీ జేఏసీ..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నాయి. ఇప్పటికే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌ను ఉద్యోగ సంఘాలు బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికి ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు శనివారం ఉదయం సమావేశమయ్యాయి. పీఆర్సీపై ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి గడువు ఇవ్వాలని నిర్ణయించారు. పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి చేరి మూడేళ్లయినప్పటికి తమకు రిపోర్ట్ ఇవ్వడానికి కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఉద్యోగ సంఘాలు విమర్శించాయి.

అధికారుల కమిటీని నియమించి అధ్యయనం చేస్తామని చెప్పడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆరోగ్య కార్డు అనారోగ్య కార్డుగా మారిందని.. కనీసం రీయింబర్స్‌మెంట్‌ కింద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి కూడా లేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జీతాల నుంచి కట్ చేస్తున్న డబ్బులను కూడా తిరిగి తమకు ఇవ్వడం లేదని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ‘మా డబ్బులు మాకు ఇచ్చేందుకు కూడా డబ్బుల్లేవా’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వైసీపీ మేనిఫెస్టో చూసి ఎంతో సంతోషించామని.. ఆర్థిక, ఆర్థికేతర డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని భావించినట్లు తెలిపారు. అయితే తమ సంతోషాన్ని ప్రభుత్వం ఆవిరి చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగుల ఓట్లు అక్కర్లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. సీపీఎస్‌ రద్దు , ఒక్కరోజు ఆలస్యం లేకుండా పీఆర్సీ ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని బండి శ్రీనివాసరావు ప్రశ్నించారు.



Next Story

Most Viewed