సర్కారు భవనాలకు టులెట్ బోర్డు.. సిద్ధమైన జాబితా

by  |
citizen friendly services of transport department
X

కేంద్రం బాటలోనే రాష్ట్రం పయనిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాలకు బీఎస్ఎన్ఎల్ కార్యాలయాలకు టులెట్ బోర్డులు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదే తరహాలో ప్రధాన కూడళ్లలో ఉన్న సర్కారు ఆఫీసుల భవనాలను అద్దెకు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతున్నది. రాజధాని నడిబొడ్డున విశాలమైన భవనాల్లో కొనసాగుతున్న కార్యాలయాలను ముందుగా అద్దెకు ఇవ్వనుంది. ఆఫీసులు ఎంతమంది పనిచేస్తున్నారు. నిత్యం జరిగే కార్యకలాపాలు ఏంటి? తదితర వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వెనుకవైపు కార్యాలయాలుగా నడపడంతోపాటు ముందు భాగాన్ని హోటళ్లు, హాస్టళ్లు, కంపెనీల ఆఫీసులకు అద్దెకు ఇవ్వనున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ కార్యాలయాలు ఇక నుంచి హోటళ్లుగా, ప్రైవేట్ హాస్టళ్లుగా.. ప్రైవేట్​కంపెనీల కార్యాలయాలుగా మారనున్నాయి. ప్రభుత్వ శాఖలను ప్రైవేట్​పరం చేస్తూ వాటి పరిధిలోని ఆస్తులను అమ్మేందుకు కేంద్రం రాచమార్గం వేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని బీఎస్‌ఎన్‌ఎల్ భవనాలను కిరాయికి ఇచ్చే ప్రక్రియ మొదలైంది. అవసరానికి మించి విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను లీజు రూపంలో అద్దెకు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే పలు శాఖల నుంచి వాటి సమగ్ర వివరాలను సేకరించింది.

నిర్వహణ భారం

కొన్ని చోట్ల అద్దెభవనాల్లో కార్యాలయాలను నడుపుతున్న సర్కారు నెల నెలా కిరాయిలు కట్టేందుకు ఇబ్బందులు పడుతున్నది. ఇతర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భవనాలను అద్దెకు ఇవ్వడం ద్వారా ఖర్చును కొంత తగ్గించుకొనే చాన్స్ ఉంటుంది. కార్యాలయాల నిర్వహణను ప్రభుత్వం భారంగా భావిస్తున్నది. ఇప్పటికే చాలా ఆఫీసుల్లో మెయింటెనెన్స్​ ఛార్జీలను నిలిపివేశారు. రెగ్యులర్​గా విడుదల చేసే సామగ్రి కొనుగోలు నిధులకు బ్రేక్​ వేసింది. విద్యుత్‌ను వృథా చేస్తున్నారంటూ ప్రీపెయిడ్​ మీటర్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న కార్యాలయాల నిర్వహణకు నెలవారీ ఖర్చులు ఎక్కువవుతున్నట్లు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే వాటిని తగ్గించుకోవడం, అదనంగా ఆదాయం తెచ్చుకోవడంపై వ్యూహం వేసినట్టు అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఎక్కడ.. ఎంతెంత అవసరం

ప్రభుత్వ ఆస్తులను అమ్మేందుకు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ముందుగా వాటిని లీజు రూపంలో ప్రైవేట్​కు అప్పగించనున్నారు. ప్రతినెలా అద్దె తీసుకునే ప్లాన్​ వేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాల వివరాలన్నీ తెప్పించుకున్నారు. ఎంత విస్తీర్ణం ఉంది? ప్రస్తుతం సదరు శాఖ పనితీరు? ప్రాధాన్యత? పనిచేస్తున్న ఉద్యోగులు? ఎంత మేరకు అవసరం ఉంటుందనే సమగ్ర వివరాలతో నివేదికను తీసుకున్నారు. చాలా ప్రాంతాల్లో పని చేస్తున్న దానికంటే అదనంగా ఉందని నిర్ధారణకు వచ్చారు. వందమందితో ఉండే ప్రభుత్వ శాఖ దగ్గర ఎకరాలకొద్ది స్థలం, విశాలమైన భవనాలు ఉన్నట్లు నివేదికల్లో పేర్కొన్నారు.

ముందుగా ఇవే..

నగరం నడిబొడ్డున ఉండే సోమాజిగూడ, ఖైరతాబాద్, నాంపల్లి వంటి ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను అద్దెకివ్వనున్నారు. కొంత భాగంలో.. అంటే ప్రస్తుతం ఉన్న భవనాల వెనకవైపు ఇప్పుడున్న కార్యాలయాలను తరలించనున్నారు. ముందుభాగాన్ని కార్యాలయ భవనంతో పాటుగా కొంత మేరకు స్థలాన్ని కిరాయికి ఇస్తారు. ఇప్పటికే టూరిజం హోటళ్లను అదే తరహాలో లీజుకిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కీలకప్రాంతాల్లో ఉన్న సర్కారు ఆఫీసులను అద్దెకు ఇస్తే.. కొంతమంది ప్రైవేట్​ హోటళ్లు నిర్వహిస్తున్న వారు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఇప్పటికే అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతుండటంతో.. కొంతమంది వ్యాపారులు వాటి కోసం ఎదురుచూస్తున్నారనే చర్చ సాగుతున్నది. ఏదిఏమైనా ఇప్పటివరకు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ఇక నుంచి హోటళ్లు, ప్రైవేట్​ కంపెనీల కార్యాలయాలు ఏర్పాటుకానున్నాయి.



Next Story

Most Viewed