నకిరేకల్ తొలిపుర చైర్మన్ అభ్యర్థిగా గోల్డ్ వ్యాపారి..?

by  |
Nakirekal Municipality
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ మినీ పురపోరులో భాగంగా జరుగుతున్న నకిరేకల్ మున్సిపాలిటీ ఎన్నికలు రోజురోజూకీ రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ముగిసి ప్రచార పర్వం జోరుగా సాగుతోంది. కాగా ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెండు గ్రూపుల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడినవారికి కాకుండా పార్టీలోకి వలస వచ్చినవారికి పార్టీ బీ ఫామ్‌లు ఇవ్వడంతో వివాదానికి తెరలేచింది. ఇప్పుడు ఇదే నల్లగొండ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పట్టణానికి చెందిన ఓ గోల్డ్ వ్యాపారి పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. నకిరేకల్ పుర స్థానాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని టీఆర్ఎస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే టీఆర్ఎస్ నుంచి పుర చైర్మన్‌గా గోల్డ్ వ్యాపారి పేరును ఆ పార్టీ వర్గాలు కన్‌ఫర్మ్ చేశాయని తెలుస్తోంది.

అంతా సిద్ధం చేసుకున్న గోల్డ్ వ్యాపారి..?

నకిరేకల్ మేజర్ గ్రామపంచాయతీ నుంచి పురపాలికగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మొదటి చైర్మన్‌ తాను కావాలనే ఉద్దేశంతో సదరు వ్యాపారి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం కౌన్సిలర్లకు పార్టీ ఇచ్చే ఫండ్ కాకుండా సొంతంగా ఆర్థికంగా సహకరించే హామీని సైతం ఇప్పటికే ఇచ్చేశారట. సదరు వ్యాపారి స్థానిక ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితంగా ఉండడం.. దాదాపు 10 సంవత్సరాలకు పైగా సహకరిస్తుండడంతోనే గోల్డ్ వ్యాపారి పేరు ఫైనల్ అయ్యిందనే చర్చ లేకపోలేదు.

అభ్యర్థులు ఉపసంహరించుకునేలా ప్లాన్..

నకిరేకల్ పట్టణంలోని కొన్ని వార్డుల్లో ఇతర పార్టీలు, ఇండిపెండేంట్ అభ్యర్థులు ఏ మాత్రం బలంగా కన్పించినా.. వారు తమ నామినేషన్ ఉపసంహరించుకునేలా తగిన ఆఫర్ చేశారనే ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను తమవైపునకు లాక్కుని బీ ఫామ్ ఇచ్చేందుకు ఇచ్చేశారట. ఏదీఏమైనా ఈసారి నకిరేకల్ పుర పీఠాన్ని చేజిక్కించుకునేందుకు వ్యుహాప్రతివ్యుహాల్లో అధికార టీఆర్ఎస్ నిమగ్నమయ్యింది.

అసంతృప్తిలో కొంతమంది నేతలు..?

అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో కొంతమంది నేతలు మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటంటూ సొంత పార్టీ నేతలే తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది అభ్యర్థులు రెబెల్ గా పోటీలో నిలిచారు. అందుకోసం రెబెల్ వర్గం అంతా స్థానికంగా ఓ పార్టీ తరపున బరిలోకి దిగారు. అయితే ప్రచారంలో వెనక్కి తగ్గేలా ప్రత్యర్థి అభ్యర్థులను మభ్య పెట్టె ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పార్టీకి సంబంధించిన అభ్యర్థి పోటీలో ఉన్నా.. ప్రచారం చేయకుండా ఇంటికే పరిమితం చేయడంలో అధికార టీఆర్ఎస్ సఫలీకృతం అయ్యింది. ఇదే ఊపుతో నకిరేకల్ పుర పీఠాన్ని దక్కించుకునేందుకు పక్కా వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తోంది.

Next Story

Most Viewed