గోదావరి బోర్డు మీటింగ్‌ సాగిందిలా!

by  |
గోదావరి బోర్డు మీటింగ్‌ సాగిందిలా!
X

దిశ, న్యూస్ బ్యూరో: పోలవరం నుంచి పట్టిసీమకు తరలిస్తున్న 80 టీఎంసీల్లో తెలంగాణకూ వాటా కావాలని, నిబంధనల ప్రకారం ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు, గోదావరి ఎగువ రాష్ట్రాలకు 35 టీఎంసీల వాటా ఉందని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 45 టీఎంసీలు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు వాటా కేటాయించాల్సి ఉందని, ఇంకా కేటాయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కృష్ణా బోర్డుకు… అటు నుంచి గోదావరి బోర్డుకు వివరించాలని తప్పించుకుంటున్నారన్నారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం జలసౌధలో ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఏపీ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఈఎన్సీలు, ఇంజనీర్లు పాల్గొన్నారు. గోదావరి బోర్డు మీటింగ్‌లో కూడా వాడివేడీగా వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు తెలంగాణ నుంచి ఆధారాలతో సమావేశం ముందుంచారు.

శ్రీ కృష్ణ కమిటీ నివేదికల్లోనే వాటా గురించి ఉంది

గోదావరిలో ప్రాజెక్టు వారీగా కేటాయింపులు లేవని, అలాంటప్పుడు 967 టీఎంసీలు ఎలా అంటారు అని ఏపీ అడగడంతో తెలంగాణ అధికారులు వివరాలన్నీ బోర్డు ముందుంచారు. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీకి అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన నివేదికల్లో 967 టీఎంసీల కేటాయింపులున్నాయని, ఎమ్మెల్యేలకు ఇచ్చిన హ్యాండ్ బుక్కుల్లో కూడా ఉన్నాయని, అందులో 967 టీఎంసీలు తెలంగాణకు ఉన్నట్లు స్పష్టంగా ఉందని వెల్లడించారు. గోదావరిలో వాటా లేదంటూ మాట్లాడటం కరెక్ట్ కాదని, సాగునీరు, ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందనే విషయం గుర్తు చేశారు. 967 టీఎంసీల నీటిని వాడుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా పట్టిసీమకు తరలించే 45 టీఎంసీల్లో తెలంగాణకు వాటా ఉందని, దాన్ని తేల్చాలని బోర్డుకు సూచించారు. దీనిపై కేఆర్ఎంబీకి లేఖ రాస్తామని బోర్డు చెప్పడంతో తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. కేఆర్ఎంబీ అటూ గోదావరి బోర్డు అని కృష్ణా బోర్డు అని ఏండ్ల నుంచి ఇదే సమాధానం చెప్పుతున్నారన్నారు. దీని వెంటనే తేల్చాలని పట్టుబట్టారు. అదేవిధంగా పోలవరం బ్యాక్ వాటర్ స్టడీ చేయాలని తెలంగాణ సూచించింది. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాస్తామని, అక్కడ నుంచి సరైన రిప్లై రాకుంటే బోర్డు తరుపున చూసుకుంటామని ఛైర్మన్ వెల్లడించారు.

అన్ని పాత ప్రాజెక్టులే… డీపీఆర్‌లు ఇచ్చేది లేదు

గోదావరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టులు లేవని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులు కొత్తవి కావన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2017లోనే సమగ్రమైన నివేదిక ఇచ్చిందని, ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేశారని చెప్పారన్నారు. అయితే రీ డిజైనింగ్ చేసినా కొత్త ప్రాజెక్టుగా భావించాలని ఏపీ మరోసారి అభ్యంతరం చెప్పింది. గోదావరి బేసిన్‌లో కొత్త ప్రాజెక్టులు లేవు కనుక డీపీఆర్‌లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పారు. ఇరు రాష్ట్రాలు గోదావరి నదిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఈ నెల 10 వరకు ఇవ్వాలని బోర్డు సూచించింది.

2014 తర్వాత కొత్త ప్రాజెక్టుల్లేవ్ : రజత్ కుమార్

గోదావరి నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, దీనిపై బోర్డు సమావేశంలో తమ వాదనలు వినిపించాలమని రాష్ట్ర నీటిపారుదల ముఖ్యకార్యదర్శి రజత్‌ కుమార్‌ వివరాలను వెల్లడించారు. గోదావరి బేసిన్‌లో ఒక్క కొత్త ప్రాజెక్టు లేదని వెల్లడించామని, కాళేశ్వరం, తుమ్మిడిహట్టి ప్రాజెక్టులను కొత్త ప్రాజెక్టులుగా పరిగణించకూడదని కోరామని చెప్పారు. తెలంగాణకు రావాల్సిన వాటా ప్రకారమే ఎత్తిపోతల నిర్మాణం చేపట్టామని చెప్పారు. గోదావరిపై ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. 2014 జూన్‌ 2 వరకు పూర్తయిన ప్రాజెక్టుల గురించి అడగవద్దని కోరామన్నారు. పోలవరం, పట్టిసీమపై బోర్డు దృష్టికి తీసుకువచ్చామని, పోలవరం నుంచి పట్టిసీమకు 80 టీఎంసీల నీటిని తరలిస్తున్నారని వెల్లడించారు. టెలిమెట్రీల విషయంలో సాంకేతిక సమస్యలపై కృష్ణా, గోదావరి బోర్డులకు స్పష్టంగా చెప్పామన్నారు. పోతిరెడ్డిపాడు దగ్గర వెంటనే టెలిమెట్రీ ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పామన్నారు. గోదావరి బేసిన్ లో టెలిమెట్రీ ఏర్పాటు చేయాల్సి ఉందని, కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, బోర్డు కూడా అంగీకరించిందన్నారు. గోదావరి బేసిన్‌లో తమకు 967 టీఎంసీల వాటా ఉందని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇస్తే నీటి వాడకం, మాకు ఎంత నీరు డ్రా చేసుకుంటున్నారో తెలుస్తుందని, డీపీఆర్ లు ఇవ్వాలన్నారని వివరించారు. కానీ పాత ప్రాజెక్టుల డీపీఆర్‌లు అడిగితే ఎందుకు ఇస్తామని, శ్రీరాం సాగర్ డీపీఆర్ లు ఇవ్వమంటే ఇస్తామా అని రజత్ కుమార్ ప్రశ్నించారు. సాగునీరు, ప్రాజెక్ట్ ల విషయంలో నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పాత ప్రాజెక్ట్‌ లకు డీపీఆర్‌ అడగొద్దని చెప్పామని, కాళేశ్వరాన్ని కొత్త ప్రాజెక్ట్‌ గా భావించొద్దని చెప్పామని పేర్కొన్నారు. లోకేషన్‌, డిజైన్‌ మార్పులాంటి కారణాలతో కొత్త ప్రాజెక్ట్‌‌గా పరిగణించొద్దని, గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారమే ప్రాజెక్ట్‌ లను నిర్మిస్తున్నామని తెలిపారు.

డీపీఆర్‌లు సమర్పించండి: గోదావరి బోర్డు

సమావేశం అనంతరం గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ప్రకటన విడుదల చేశారు. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌)లను సమర్పించాల్సిందేనని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఆదేశించామని, ఈ నెల 10లోగా ఇవ్వలని సూచించారు. బోర్డుతో పాటు కేంద్ర జల సంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతులు రావాలంటే డీపీఆర్‌లు అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో వాదనలు, చర్చించిన అంశాలను అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అజెండాగా పంపిస్తామన్నారు. టెలిమెట్రీకి సంబంధించిన అంశాలపై కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు.



Next Story

Most Viewed