కేటీఆర్ హడావుడికి రీజన్ ఇదే..!

by  |
కేటీఆర్ హడావుడికి రీజన్ ఇదే..!
X

దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఎన్నికలే లక్ష్యంగా అభివృద్ధి పథకాలను వీలైనంత త్వరగా చేపట్టాలని హెచ్ఎండీఏ భావిస్తున్నది. అందులో భాగంగానే రహదారుల అభివృద్ధి, జలాశయాల సుందరీకరణ, స్కైవేల ఏర్పాటు, రేయిన్ గార్డెన్‌ల నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్‌కు సొబగులు, తార్నాకలో టీవోడీ వంటి భారీ పథకాలను చేపట్టేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అక్టోబర్ నాటికి బాలానగర్ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి నగరవాసులకు కానుకగా ఇచ్చేందుకు కృషి చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దాంతోపాటు నగరంలోని పలు పనులకు ఆగమేఘాల మీద అధికారులు టెండర్లను పిలుస్తున్నారు. హుస్సేన్ సాగర్ కోసం ఆఫీసర్లు ప్రత్యేకంగా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నారు. 10 ఎకరాల్లో రూ.12 కోట్లతో లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ఉప్పల్ భగాయత్‌లో మరో అందమైన రేయిన్ గార్డెన్‌తోపాటు మరో 9 ప్రదేశాల్లో రేయిన్ గార్డెన్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం నగర శివారులోని జల్‌పల్లి, రాంపల్లి చెరువులను హెచ్‌ఎండీఏ సుందరీకరిస్తున్నది. మరో 18 చెరువులను సుందరీకరించేందుకు టెండర్లను పిలవాలని నిర్ణయించింది. సిటీలో పాదచారుల ఇబ్బందులను నివారించేందుకు ప్రత్యేకంగా ఫుట్ ఓవర్ బ్రడ్జీలను ఏర్పాటు చేస్తున్నది. పలు చోట్ల స్కైవేలను నిర్మించాలని టెండర్లను పీపీపీ పద్దతిలో పిలిచారు. మొత్తం పథకాలు సుమారు రూ. 2,500 కోట్లుగా అంచనాగా అధికారులు పేర్కొంటున్నారు. మరో రూ. 2,400 కోట్లతో చేపట్టనున్న రెండు భారీ ఫ్లైఓవర్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మొత్తంగా జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి ప్రభావం హెచ్ఎండీఏపై పడింది.


Next Story

Most Viewed