కరీంనగర్ : గీతాభవన్ యాజమాని తల్లిపై కత్తితో దాడి..

by  |
కరీంనగర్ : గీతాభవన్ యాజమాని తల్లిపై కత్తితో దాడి..
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళపై ఆగంతకుడు కత్తితో దాడి చేయగా ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నగరంలోని ముకరంపురలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలో పేరు గాంచిన గీతాభవన్ హోటల్ అధినేత రాజీవ్ శెట్టి దంపతులు సెవెన్ హిల్స్ సమీపంలో గల సొంత ఇంటిలో నివాసముండేవారు. భర్త రాజీవ్ శెట్టి మృతి అనంతరం భార్య వాసంతి కొడుకు సందీప్ శెట్టితో కలిసి ఆ ఇంట్లోనే ఉంటోంది.

ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలోసందీప్ శెట్టి తల్లి వాసంతి(55) బయటకు వచ్చి తిరిగి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. భయంతో ఆమె కేకలు వేయటంతో వదిలేసి బయటకు పరుగెత్తాడు. వాసంతి కేకలు విన్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని చూడగా తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే వారు సమీపంలోని సూర్య నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తీవ్ర భయాందోళనకు గురైన వాసంతి అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఆగంతకుడి దాడిలో సందీప్ శెట్టి తల్లికి పొట్ట, ముఖం భాగంలో బలమైన గాయాలు అయినట్లు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed