బ్రేకింగ్.. మిషన్ భగీరథ పంపుహౌస్ వద్ద గ్యాస్ లీక్

by  |
బ్రేకింగ్.. మిషన్ భగీరథ పంపుహౌస్ వద్ద గ్యాస్ లీక్
X

దిశ, భద్రాచలం : దుమ్మగూడెం మండలంపర్ణశాల క్రాస్‌రోడ్డు‌లో ఉన్న మిషన్ భగీరథ (సిపిడబ్ల్యుడి) పంపుహౌస్ వద్ద ప్రమాదం సంభవించింది. శనివారం రాత్రి క్లోరిన్ గ్యాస్ లీక్ అవడంతో అక్కడ పనిచేసే నలుగురు సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని దుమ్మగూడెం పిహెచ్‌సీకి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. గ్యాస్ లీక్ అయినట్టు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత మిషన్ భగీరథ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తదుపరి చర్యల్లో నిమగ్నమైనారు.

క్లోరిన్ సిలెండర్లు మార్చుతుండగా ఒక సిలెండర్ వాచర్ సరిగా లేనందున గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ముందుగా ముగ్గురు అస్వస్థతకి గురికాగా, వారిని ఆస్పత్రిలో చేర్పించి వచ్చిన శ్రీకాంత్ అనే ఉద్యోగి గ్యాస్ ఆపడానికి వెళ్ళి అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. గ్యాస్ లీక్ సమాచారం అందుకున్న దుమ్మగూడెం సీఐ వెంకటేశ్వర్లు అక్కడికి వెళ్ళి స్థానిక ప్రజలతో మాట్లాడారు. ఇదిలాఉండగా గ్యాస్ లీక్ అవడం వలన ఉద్యోగులు కోమాలోకి వెళ్ళినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో క్రాస్‌రోడ్డు వద్ద నివశిస్తున్న కుటుంబాలలో కొందరు భయంతో ఊరు విడిచి వెళ్ళినట్లు తెలిసింది. అయితే లీక్ అవుతున్న గ్యాస్‌ని బంద్ చేయకపోవడంతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు కొంత ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ బంద్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. అస్వస్థతకి గురైన వారు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు సమాచారం.



Next Story