710 ఏళ్ల చరిత్ర కల్గిన మట్టి గణపతి.. నేటికి నిమజ్జనం లేకుండా విశిష్ట పూజలు!

by  |
710 ఏళ్ల చరిత్ర కల్గిన మట్టి గణపతి.. నేటికి నిమజ్జనం లేకుండా విశిష్ట పూజలు!
X

దిశప్రతినిధి, మహబూబ్ నగర్/ నారాయణపేట : చవితి రోజు గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించి మొదలు కొన్నిరోజుల పాటు పూజలు చేసిన అనంతరం చెరువులు, నదులలో నిమజ్జనం చేయడం ఆనవాయితీ.. కానీ, నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏడువందల 10 సంవత్సరాలుగా నిమజ్జనం కాకుండా మట్టి వినాయకుని పూజలు జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ళ వీధిలో 13వ శతాబ్దంలో దీక్షితులు అనే వ్యక్తి ఇంట్లో పూజల కోసం తయారు చేసి ప్రతిష్టించిన విగ్రహాన్ని అప్పట్లో పలు కారణాల వల్ల నిమజ్జనం చేయకుండా అలాగే ఉంచి పూజలు చేస్తూ వచ్చారు. ఆ విగ్రహానికి కాలక్రమేణా అవసరమైన వెండి, తదితర ఆభరణాలను తయారుచేసి తొడిగారు. అలా ఆ విగ్రహము నిమజ్జనం కాకుండా, ఏ మాత్రం దెబ్బతినకుండా శతాబ్దాల తరబడి అలాగే ఉండి పూజలందుకుంటోంది.

తరాలు మారినా విగ్రహ పూజా విధానాలలో ఎటువంటి లోపాలు లేకుండా దీక్షితులు కుటుంబ సభ్యులు ప్రతిఏటా వినాయక చవితి రోజు పూజలు చేస్తూ వస్తున్నారు. ఈ విగ్రహం వద్ద పూజలు చేయడం ద్వారా అన్ని శుభాలు జరుగుతాయన్న ప్రగాఢ నమ్మకం దీక్షితులు కుటుంబ సభ్యులతో పాటు భక్తులకు సైతం ఉంది. ఈ క్రమంలోనే ఎక్కడ ఉన్నా దీక్షితుల వంశస్థులు వినాయక చవితి రోజు నారాయణపేటకు చేరుకుని పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం తరతరాలుగా పూజలందుకుంటున్న వినాయకునికి దీక్షితులు వంశీయుడైన అన్నప్ప దీక్షితులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిషేకాలు తదితరాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎంతో పురాతన చరిత్ర ఉన్న ఈ వినాయకుని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడం విశేషం.


Next Story