ఎనిమిదేళ్ళయినా విజిలెన్స్ రిపోర్టులే లేవు

by  |

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రతీ ఏటా శాసనసభ సమావేశాల్లో విజిలెన్స్ కమిషన్ నివేదికను సమర్పించాల్సి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఎనిమిది సంవత్సరాలుగా దాన్ని తుంగలో తొక్కిందని, గతంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోయిందని ప్రస్తుత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లిఖితపూర్వకంగా తెలియజేసింది. పరిపాలనలో చోటుచేసుకుంటున్న అవినీతి, ప్రభుత్వ ఉద్యోగుల అలసత్వం, బాధ్యతారాహిత్యం లాంటివి ప్రజలకు తెలియజేయాలంటే విజిలెన్స్ కమిషన్ రిపోర్టు మాత్రమే ఏకైక మార్గమని, కానీ దాన్ని ప్రభుత్వం ఏనాడూ లెక్కపెట్టలేదని పేర్కొన్నారు. గతంలో గవర్నర్‌కు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించి విజ్ఞప్తి చేశామని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి ఇప్పటివరకు తీసుకున్న చర్యలను తెలియజేయాల్సిందిగా కోరినా ఎలాంటి జవాబురాలేదని ఫోరమ్ కార్యదర్శి పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.

అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసిన తర్వాత విచారణ జరిపి నివేదికను విజిలెన్స్ కమిషన్‌కు పంపుతుందని, పరిశీలన అనంతరం తగిన సలహా, సూచనలతో ప్రభుత్వానికి రిపోర్టు చేస్తుందని, కానీ అలాంటి కార్యాచరణ ఎనిమిదేళ్ళుగా జరగడమే లేదని గవర్నర్‌కు వివరించారు. కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదికలు వెళ్తున్నా శాసనసభలో మాత్రం వాటిని ప్రభుత్వం బహిర్గతం చేయడంలేదని, విజిలెన్స్ కమిషన్ మాన్యువల్‌ను ప్రభుత్వం పాటించడంలేదని పేర్కొన్నారు. అవినీతి అధికారులకు సచివాలయం కొమ్ము కాస్తోందని, ప్రభుత్వ తీరు వలన తప్పుచేసినవారికి శిక్ష పడుతుందనే భయమే లేకుండా పోయిందని పద్మనాభరెడ్డి ఆ విజ్ఞప్తిలో పేర్కొన్నారు.

Next Story

Most Viewed