కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు మృతి

by  |
కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ రాజేశ్వరరావు మృతి
X

దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ కేవీ రాజేశ్వర్ రావు (84) బుధవారం గుండెపోటుతో మరణించారు. మెట్‌పల్లి ఖాదీ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన హైదరాబాద్ తిలక్‌నగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. రాజేశ్వరరావు మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో జన్మించారు. మొగిలిపేట గ్రామ సర్పంచ్‌గా రెండు దశాబ్దాల పాటు పనిచేశారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీలో చేరి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు.

అనంతరం 2001లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి, మెట్‌పల్లి జెడ్పీటీసీగా గెలిచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా వ్యవహరించారు. అనంతరం ఖాదీ బోర్డ్ చైర్మన్‌గా 12 సంవత్సరాలుగా సేవలందించారు. రాజేశ్వరరావు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుతో పాటు మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్‌తో అతి సన్నిహితంగా ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆయన మరణవార్త తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Next Story