ఎండలో ‘క్యూ’ కట్టిన చెప్పులు

by  |
footwear kept in queue for vaccine
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఎక్కడైనా మనుషులు క్యూ కట్టడం.. వాహనాలు క్యూ కట్టడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం చెప్పులు క్యూ కట్టాయి. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజమే. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గ్రామంలోని బస్తీ దవాఖాన ఎదుట గురువారం ఉదయం నుంచి చెప్పులు క్యూ కట్టాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో వరస క్రమంలో నిల్చున్నాయి. ఎందుకో తెలుసా..? కరోనా టీకాలు వేయించుకోవడానికి. చెప్పుటు టీకాలు ఎందుకు వేసుకుంటాయి అనుకుంటున్నారా..? చెప్పులు కాదుగానీ, వాటిని ధరించే మనుషులే వాటిని లైన్ లో పెట్టారు. ఇంతకు విషయం ఏంటంటే..?

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం గ్రామంలోని బస్తీ దవాఖానలో కరోనా నివారణకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వ్యాక్సిన్ వేసే కేంద్రాలు లేకపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తున్నారు. అయితే గురువారం ఉదయం 9 గంటలకు వ్యాక్సిన్ వేసుకునేందుకు వృద్ధులు భారీగా అక్కడికి చేరుకున్నారు. వైద్యులు మాత్రం ఇప్పటికే స్లిప్పులు తీసుకున్న వారికి మాత్రమే టీకాలు వేస్తామని, కొత్తవారు క్యూలో ఉండాలని కోరడంతో వారంతా లైన్ కట్టారు. కానీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఎండతీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఓ వృద్ధురాలు తన చెప్పులను లైన్ లో పెట్టి పక్కనున్న వాటర్ ట్యాంక్ నీడన కూర్చుంది. మిగతా వారంతా చెప్పులను క్యూలో పెట్టి పక్కన కూర్చున్నారు. దీంతో యజమానుల కోసం చెప్పులు క్యూ కట్టాల్సి వచ్చింది.


Next Story

Most Viewed